అతను పిలిచి మరీ చంపాడు! గర్ల్ ఫ్రెండ్ విడిపోయినా..
వాషింగ్టన్: నాలుగు రోజులక్రితం అమెరికాలోని సియాటెల్ నగరంలోని ఓ ఉన్నత పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో తోటి విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడైన విద్యార్థి ముందుగా తన సహచరులకు ఎస్సెమ్మెస్ ఇచ్చి, వాళ్లను భోజనానికి పిలిచి, టేబుల్ వద్దే కాల్చాడు.
ఈ విషయాన్ని పోలీసులు అధికారులు తెలిపారు. 15 ఏళ్ల జేలెన్ ప్రైబెర్గ్ కాల్పులు జరిపే సమయానికి లంచ్ టేబుల్ వద్ద ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వాళ్లను కాల్చిన తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దర్యాఫ్తులో భాగంగా అతడి ఎస్సెమ్మెస్, ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా రికార్డులను విచారణ అధికారులు పరిశీలించారు.
అయితే, అతను ఈ కాల్పులకు ఎందుకు పాల్పడ్డాడనే విషయం ఇంకా తేలలేదు. మంచి ఫుట్బాల్ ఆటగాడు అయిన అతడితో ఓ గర్ల్ ఫ్రెండ్ విడిపోయినప్పటికీ అతను ఎప్పుడు సంతోషంగానే ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు.
కాగా, ఈ కాల్పులు జరిగిన సమయంలో ఓ టీచర్ సాహసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ టీచర్ సాహసం మరింతమంది ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఆ టీచర్ హీరో అయ్యారు. కాల్పులు జరిగిన పాఠశాలలో కొత్తగా చేరిన టీచర్ మెగాన్ సిల్ బెర్గర్ ధైర్యంగా ముందుకు ఉరికి అతనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
లేకుంటే మరింత మందిని అతను పొట్టనబెట్టుకునేవాడని ప్రత్యక్షసాక్షులు, పాఠశాల సిబ్బంది తెలిపారు. మెగాన్ చేసిన సాహసాన్ని పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు కొనియాడారు.
సిల్ బెర్గర్ కాల్పులు జరుపుతుంటే ధైర్యంగా అడ్డు వెళ్లి కాల్పులు జరుపుతున్న విద్యార్థిని నిలువరించే ప్రయత్నం చేశారు. నిందితుడు తుపాకీని రీలోడ్ చేస్తున్న సమయంలో టీచర్ అతని వద్దకు ఒక్కసారిగా వెళ్లి, అతని చేతిలోని ఆయుధాన్ని తీసుకున్నారు. నిందితుడు తనను తాను కాల్చుకునే ముందు తుపాకీని సదరు టీచర్కు గురి పెట్టాడు.