ఐసిస్: ఆత్మాహుతి దాడిలో మరణించిన ఎంపీ తనయుడు
న్యూఢిల్లీ: తన కుమారుడు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్లో చేరాడని జోర్డాన్ పార్లమెంట్ సభ్యుడొకరు తెలిపారు. మూడు నెలల పాటు అతడిని ఐసిస్లో చేరకుండా ప్రయత్నించామని పేర్కొన్నారు.
అయినా సరే తమ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. జోర్డాన్ ఎంపీ మాజెన్ దలాయిన్ మాట్లాడుతూ 23 ఏళ్ల తన కుమారుడు మహ్మాద్ ఇరాక్లో ఆత్మాహుతి దాడికి కూడా పాల్పడ్డాడని వెల్లడించారు.
ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న అతడిని జూన్ నెలలో చివరిసారిగా చూశామని అసోసియేటెడ్ ప్రెస్కి ఇచ్చిన ఇంటర్యులో తెలిపారు. టర్కీ, సిరియా మీదుగా అతడు ఇరాక్ వెళ్లాడని వెల్లడించారు.
ఐసిస్లో చేరకుండా అతడిని నిలువరించేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. తమ కుమారుడు మృతి చెందినట్టు శనివారం గుర్తించామని చెప్పారు. ఇరాకీ ఆర్మీ పోస్టుపై జరిగిన కారు బాంబు దాడిలో చనిపోయిన ముగ్గురు ఫొటోలను ఐఎస్ వెబ్సైట్లో పెట్టిందని, అందులో తమ కుమారుడు ఉన్నాడని మాజెన్ వెల్లడించారు.