అందుకే ప్రాణాలకు తెగించా, మనుషులుగా ప్రేమిద్దాం: కాన్సాస్ ‘హీరో’ ఇయాన్(వీడియో)
పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందగా, అలోక్ అనే మరో తెలుగు ఇంజినీర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. కాగా, వీరిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇయాన్ గ్రిలాట్ కూడా తీవ్ర గాయ
వాషింగ్టన్: ఇద్దరు తెలుగు ఇంజినీర్లపై ఓ అమెరికా జాత్యహంకారి జరిపిన కాల్పులను నిలువరించడానికి మరో అమెరికన్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందగా, అలోక్ అనే మరో తెలుగు ఇంజినీర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. కాగా, వీరిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇయాన్ గ్రిలాట్ కూడా తీవ్ర గాయాలయ్యాడు.
కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. ఘటన జరిగిన చోట ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టినట్లు చెప్పాడు. అక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయని, వారిలో పిల్లలు కూడా ఉన్నారని ఇయాన్ చెప్పారు. వారిని కాపాడేందుకే తాను అతడ్ని అడ్డుకున్నట్లు తెలిపాడు.
'ఆ పరిస్థితుల్లో ఊరికే చూస్తూ ఉండలేకపోయాను. అందుకే మరింత మందిపై కాల్పులకు తెగబడకుండా ఆడమ్ పూరింటన్(కాల్పులు జరిపిన వ్యక్తి)ను నిలువరించడానికి ప్రయత్నించాను' అని ఇయాన్ వివరించారు. గ్రిలాట్ చికిత్స పొందుతున్న 'యూనివర్సిటీ ఆఫ్ కేన్సస్ హెల్త్ సిస్టమ్స్' ఆస్పత్రి అధికారులు.. ఆస్పత్రి యూట్యూబ్ పేజీలో ఉంచిన వీడియోలో ఆయన ఈ విషయం చెప్పారు.
ఎక్కడా అందరూ అందర్నీ ద్వేషించరని ఇయాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరిగిన ఘటనను ఎవరూ హర్షించరని, అందరూ వ్యతిరేకించాల్సిందేనని స్పష్టం చేశాడు. మన మధ్య ధ్వేషం వద్దని, మనుషలుగా ఉందామని చెప్పాడు. వర్ణం, జాతి, లింగ భేదాలు చూపకుండా అందరం కలిసి ప్రేమగా జీవిద్దామని పిలుపునిచ్చాడు. కాగా, చేతిలో, ఛాతీలో తూటా గాయాలైన గ్రిలాట్ పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు.
అయితే ఆస్పత్రిలో ఆయన చాలా కాలమే ఉండాల్సి వస్తుందని, పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. 24 ఏళ్ల గ్రిలాట్ నిర్మాణ రంగంలో కార్మికుడు. బుధవారం సాయంత్రం కేన్సస్ రాష్ట్రం ఓలెత్ నగరంలోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్లో ఆడమ్ పూరింటన్ జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్(32) చనిపోగా, వరంగల్కు చెందిన మాదసాని అలోక్రెడ్డి గాయపడ్డారు.
కాల్పుల బాధితులు, వారి కుటుంబ సభ్యుల కోసం 'గోఫండ్మీ' వెబ్సైట్లో చేపట్టిన విరాళాల సేకరణ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. వాషింగ్టన్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయానికి శ్రీనివాస్ పేరిట సుమారు రూ.4.31 కోట్లు, గ్రిలాట్ చికిత్స కోసం దాదాపు రూ.2.7 కోట్ల విరాళాలు వచ్చాయి. దర్యాప్తు అధికారులు ఆడమ్ పూరింటన్ను జాన్సన్ కౌంటీ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది.
శాంతి కోరుతూ భారీ ర్యాలీ
కాగా, శ్రీనివాస్ కూచిభొట్ల మృతికి సంతాపంగా కన్సాస్లో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులతోపాటు అనేకమంది ప్రవాసభారతీయులు, అమెరికన్లు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆకాంక్షించారు. కాల్పుల ఘటనలో గాయపడిన అలోక్ రెడ్డి, ఆయన సతీమణి రీప్తి గంగుల కూడా ఈ ర్యాలీలో పాల్గొని.. శ్రీనివాస్ మృతికి నివాళులర్పించారు.