బిగ్ షాక్ : నాలుగు రోజుల్లో.. బ్యాక్టీరియా అతన్ని తినేసింది
వాషింగ్టన్ : వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ వార్త ముమ్మాటికీ నిజం. ఇప్పటిదాకా ఏ హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే ఇలాంటి ఘటనలు చూసుంటాం. బహుశా తొలిసారిగా.. ఇలాంటి వాస్తవం ఒకటి వెలుగుచూసిందేమో! అమెరికాలోని ఓషన్ సిటీలో మైకేల్ ఫంక్ అనే వ్యక్తి నిజంగానే బ్యాక్టీరియాకు బలైపోయాడు.
సముద్ర నీటిలో పీతల వంటకాలకు సంబంధించిన పాత్రలను శుభ్రపరుస్తున్న సమయంలో.. అతని శరీరంలోకి అత్యంత ప్రమాదకరమైన విబ్రియోసి వల్నిఫికస్ అనే బ్యాక్టీరియా ప్రవేశించింది. అతని కాలికి అయిన చిన్న గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా.. కేవలం నాలుగురోజుల్లోనే అతని ప్రాణాలను బలిగొన్నది.
సెప్టెంబర్ 11న అతని శరీరంలోకి బ్యాక్టీరియా చేరగా.. సెప్టెంబర్ 15న దాని ప్రభావం తీవ్ర తరమై మైకేల్ ఫంక్ తన ప్రాణాలు కోల్పోయాడు. బ్యాక్టీరియా ద్వారా శరీరమంతా చాలా వేగంగా ఇన్ఫెక్షన్ ప్రబలడంతో శరీరమంతా పుండ్లు పడినట్లుగా తయారైంది. రక్తంలో చేరిన బ్యాక్టిరియా.. అతని అవయవాలను తినేయడం మొదలుపెట్టింది. అప్పటికీ బ్యాక్టీరియా సోకిన కాలును డాక్టర్లు పూర్తిగా తొలగించినా.. లాభం లేకుండా పోయింది.
అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి ఘటనపై.. ప్రస్తుతం మేరీలాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ విచారణ జరుపుతోంది. సాధారణంగా వేడిగా ఉండే ఉప్పునీటిలో ఈ విబ్రియో వల్నిఫికస్ బ్యాక్టీరియా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరిగి ఈ బ్యాక్టీరియా వేగంగా వ్యాపిస్తోందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యయనంలో తేలింది.
నార్త్ అట్లాంటిక్లో ఉన్న ఎనిమిది ప్రాంతాల్లో సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఈ బ్యాక్టీరియా వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.