చైనా దాడిలో 158మంది భారత జవాన్లు మృతి: ఇది పాక్ మీడియా పైత్యం
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్పై పాకిస్థాన్ మీడియా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. సిక్కిం సరిహద్దులో 158మంది భారత జవాన్లు మరణించారని పాక్ మీడియా కథనాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
చైనా దుస్సాహసం: భారత బోర్డర్ సమీపంలో యుద్ధ సన్నాహాలు, లైవ్ ఫైర్ డ్రిల్స్
158మంది జవాన్లు మృతి అంటూ..
సోమవారం చైనా రాకెట్లతో సిక్కిం సరిహద్దులో దాడి చేసిందని పాక్ మీడియా తన కథనాల్లో పేర్కొంది. అంతేగాక, ఈ దాడుల్లో 158మంది భారత జవాన్లు మరణించారని వెల్లడించింది. చైనాతో సిక్కిం సరిహద్దులో వివాదం ఉన్న సమయంలో పాకిస్థాన్ మీడియా ఈ వార్తలు ప్రచురితం చేయడంతో వైరల్గా మారింది.
భారత్ ఆగ్రహం
పాక్ మీడియా కథనాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కథనాలన్నీ నిరాధారమైనవని స్పష్టం చేసింది. రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మరో దేశ మీడియా ఇలాంటి కథనాలను ప్రసారం చేయడం గర్హనీయమని మండిపడింది.
Recommended Video
మానుకుంటే మంచిది..
ఇలాంటి కథనాలను బాధ్యత గల మీడియా ప్రచురించదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే స్పష్టం చేశారు. భారత్పై దుష్ప్రచారం చేసేందుకే పాక్ మీడియా ఇలాంటి అవాస్త కథనాలను ప్రసారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి అసత్య కథనాలను మానుకుంటే మంచిదని పాక్ మీడియాకు హితవు పలికారు.
కొనసాగుతున్న ఉద్రిక్తతలు
భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో గత కొంతకాలంగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. చైనా బలగాల దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఈ క్రమంలో చైనా బెదిరింపులకు పాల్పడుతోంది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ భారత్ను హెచ్చరిస్తోంది. అయితే, భారత్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. తగిన గుణపాఠం చెప్పేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని భారత్.. చైనాకు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది.