కెనడా పార్లమెంట్పై దాడి: ఒబామా ఖండన, మోడీ కలత
ఒట్టావో/వాషింగ్టన్/న్యూఢిల్లీ: కెనడా రాజధాని ఒట్టావాలోని పార్లమెంటు పైన గుర్తు తెలియని దుండగుడు బుధవారం దాడి చేశాడు. పార్లమెంటు భవనం వెలుపలా, లోపలా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సైనికుడు మృతి చెందాడు. అనంతరం భద్రతా బలగాలు ఆ దుండగుడిని మట్టుబెట్టాయి.
పార్లమెంటు హిల్ సమీపంలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద రక్షణంగా ఉన్న సైనికుడి పైకి దుండగుడు కాల్పులు జరిపాడు. అనంతరం అటు వైపుగా కారులో వెళ్తున్న ఒక వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతడిని దించేసి పార్లమెంటు సెంట్రల్ హాలు బ్లాక్ వైపు దూసుకు పోయాడు.
సెంట్రల్ బ్లాకులోనే ప్రజాప్రతినిధుల సభ, సెనేట్ చాంబర్స్, ఎంపీలు, సెనేటర్ల కార్యాలయాలు, సీనియర్ అధికారుల కార్యాలయాలు ఉంటాయి. పార్లమెంటు భవనం లోపల దాదాపు ముప్పై రౌండ్ల కాల్పులు వినిపించాయి. దుండగుడిని భద్రతా బలగాలు కాల్చి చంపాయని తెలిపారు.
కాగా, ఒకరి కన్నా ఎక్కువ మంది దుండగులే ఉండవచ్చునని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ కెనడా బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ పేర్కొంది. పార్లమెంటు హిల్ చుట్టు పక్కల ప్రాంతాల్లోను కాల్పులు వినిపించినట్లు కథనం వెల్లడించింది. జాతీయ యుద్ధ స్మారకం వద్ద కాల్పులకు పాల్పడిన దుండగుడు నల్లటి పొడువైన జుట్టుతో, నీలి రంగు జీన్స్ ధరించి స్పార్ఫ్ చుట్టుకొని ఉన్నాడు.
కాల్పుల నేపథ్యంలో కెనడా పార్లమెంటు భవనం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. ప్రధాని స్టీఫెన్ హార్పర్ను సురక్షితంగా ఆ ప్రాంతం నుండి తప్పించాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే అమెరికా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి, రాకపోకలు మళ్లించారు.
కెనడా పార్లమెంటు ప్రాంగణంలో దుండగులు జరిపిన కాల్పులను అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నిఘా వర్గాలు ఆయనకు వివరించాయి. ఇలాంటి దాడులకు అమెరికా పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు.
కెనడా పార్లమెంటుపై ముష్కరులు జరిపిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. శాంతియుత వాతావరణానికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని చెప్పారు. దాడి జరిగిన వార్తను విన్న తర్వాత తీవ్రంగా కలత చెందానని ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు.