కలిసి నడుస్తాం, సంబంధాలు కొత్త పుంతలు: ఒబామా, మోడీ
న్యూఢిల్లీ: తాము కలిసి నడుస్తామని, తద్వారా భారత, అమెరికా వాణిజ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సిఈవోల సదస్సులో వారిద్దరు మాట్లాడారు. ఇరు దేశాల వాణిజ్యంలో 60 శాతం వృద్ధి సాధించామని, వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత వృద్ధి సాధించాలని కోరుకుంటున్నామని ఒబామా అన్నారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీఈఓల సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా సహా దేశానికి చెందిన 17 అగ్ర వ్యాపార సంస్థల సీఈఓలు పాల్గొన్నారు.
మనది ప్రపంచ స్థాయి భాగస్వామ్యం అని ఒబామా అన్నారు. పారిశ్రామికవేత్తలతో తన ఆలోచనలు పంచుకోవడం సంతోషకరంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రెండు దేశాల సంబంధాలు కొత్త ప్రపంచానికి మార్గదర్శకమవుతాయని, ఇరు దేశాల గమనం సరైన మార్గంలో వెళుతోందని చెప్పారు. వినియోగించుకోవాల్సిన వనరులు ఎన్నో వున్నాయని, వ్యూహాత్మక వాణిజ్య చర్చలతో పురోగతి సాధ్యమన్నారు.
ఇంజనీరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని, భారత్లో అద్భుతమైన వ్యాపార నైపుణ్యం ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికాలో భారత్ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. అమెరికా దిగుమతుల్లో భారత్ వాటా 2 శాతమే ఉందని, వాటిని పెంచుతామని అన్నారు. అమెరికాలో వాణిజ్య నిబంధలను హేతుబద్దీకరిస్తామని ఒబామా ప్రకటించారు.
భారత్కు కొత్త రైల్వే లైన్లు, రైళ్లు అవసరమని చెప్పారు. భారత బ్యాంకు ఖాతాలు డిజిటలైజ్ చేసేందుకు అమెరికా సాయం చేస్తుందని ఆయన ప్రకటించారు. దేశాభివృద్ధికి జీడీపీలు కొలమానం కాదని, ఇరు దేశాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించాలన్నారు. ప్రజల జీవితాల్లో వచ్చే మార్పే అభివృద్ధికి సూచిక అని ఒబామా చెప్పారు.
అన్ని సమస్యలకు పరిష్కారం సుపరిపాలనేనని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆర్ధిక వృద్ధికి మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. భారత్-అమెరికా ప్రాజెక్టులను పీఎంవో చూస్తుందన్నారు. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లో అమెరికా పెట్టుబడులు 50 శాతం పెరిగాయని చెప్పారు. ద్రవ్యోల్బణం ఐదేళ్ల కనిష్టస్థాయికి పడిపోయిందని మోదీ వివరించారు.
భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని మోడీ చెప్పారు. అధిక పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోని అన్ని ప్రాజెక్టులపై పీఎంఓ నిఘా ఉంటుందని ఆయన తెలిపారు. భారత్లో అద్భుతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని అన్నారు. అమెరికాతో ఆర్థిక సంబంధాలు సరైన దిశలోనే వెళుతున్నాయని ఆయన చెప్పారు.
గంగా ప్రక్షాళనకు చిత్త శుద్ధితో పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తన అమెరికా పర్యటన తర్వాత భారత్తో పెట్టుబడులు పెరిగాయని ఆయన వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, భారత్-అమెరికాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మోడీ అన్నారు.