మోడీ, షరీఫ్ రహస్య మంతనాలు: పాకిస్థాన్లో కలకలం
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్లు రహస్యంగా మాట్లాడుకుంటున్నారని పాక్ మీడియా సంచలన కథనాలను ప్రసారం చేసింది. పాక్ న్యూస్ ఛానెళ్ల కథనాల ప్రకారం.. ప్రముఖ పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్.. ఈ వారంలో నవాజ్ షరీఫ్ను కలిసి తిరిగి భారత్ వచ్చేశారు.
'భారత ప్రధాని నరేంద్ర మోడీ తమ దేశ ప్రతినిధుల ద్వారా తన సందేశాన్ని ప్రధాని నవాజ్ షరీఫ్కు చేరవేశారు.' అని ఓ మీడియా ఛానల్ వెల్లడించింది. కాగా, ఈ విషయాన్ని ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్లమెంటులో ప్రస్తావించింది.
జేఎస్డబ్ల్యూ ఛైర్పర్సన్ అయిన జిందాల్ తోపాటు మరో ముగ్గురు ప్రతినిధులు పాకిస్థాన్లో కొన్ని గంటలు గడిపి తిరిగి ఇండియాకు పయనమయ్యారని మీడియా కథనాలను ప్రచురితం చేసింది. ముర్రీ ప్రాంతంలో షరీఫ్తో కలిసి వీరు విందు కార్యక్రమంలో వారు పాల్గొన్నారని దున్య న్యూస్ పేర్కొంది.
ఆర్థిక, భద్రతా పరమైన చర్చలు ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ యాదవ్ మరణశిక్షపైనా చర్చించినట్లు తెలిసింది. కాగా, భారత ప్రతినిధులతో రహస్యంగా భేటీ అవడంపై స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షం నేతలు డిమాండ్ చేశారు. వ్యాపార సంబంధాల నిమిత్తమే భారత ప్రతినిధులు.. షరీఫ్ వ్యక్తిగతంగా కలిసినట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. షరీఫ్ సొంత వ్యాపారాల కోసం ఈ భేటీ జరిగినట్లు తాము భావిస్తున్నట్లు తెలిపారు.