కాశ్మీర్పై ఒబామాకి షరీఫ్, పాక్లో హిందూ గుడికి నిప్పు
శ్రీనగర్/లాహోర్: భారత పర్యటనలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాకు శనివారం విజ్ఞప్తి చేశారు. జనవరిలో భారత గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో తన పర్యటన, ఉపఖండంలోని సమస్యలపై ద్వైపాక్షిక చర్చల గురించి షరీఫ్కు ఫోన్ ద్వారా ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వారి మధ్య వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. భారత నాయకత్వంతో చర్చించి సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు కృషి చేయాలని షరీష్ కోరారని చెప్పారు. అలాగే పాకిస్తాన్లో కూడా పర్యటించాలని ఒబామాకు విన్నవించారని చెప్పారు.
అందుకు ఒబామా స్పందిస్తూ.. దేశంలో పరిస్థితులు చక్కబడ్డాక తొందరలోనే పాకిస్తాన్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారన్నారు. తాను కూడా ఏడాది భారత్లో పర్యటించి, దైపాక్షిక చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని ఒబామాకు షరీఫ్ వివరించారు. అలాగే ఇటీవల భారత్ తీసుకున్న కొన్ని చర్యలను ఆయన దృష్టికి తెచ్చారు. విదేశాంగ శాఖల కార్యదర్శుల చర్చలు, ఎల్వోసీ వద్ద కాల్పుల విరమణ, సాధారణ సంబంధాలను నిలిపివేయడాన్ని ఆక్షేపించారు.
హిందూ ఆలయానికి నిప్పు
పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హిందువులకు చెందిన ఓ దేవాలయాన్ని తగులబెట్టడం స్థానికంగా ఉన్న హిందువులు, రాజకీయ పార్టీల నిరసనలకు కారణమైంది. తండూ మహమ్మద్ ఖాన్ జిల్లాలోని హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఈ ఆలయంపై గురువారం రాత్రి పొద్దుపోయక జరిగిన దాడిలో విగ్రహాలతో పాటు కొన్ని మత గ్రంథాలు బుగ్గిపాలయ్యాయని పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ నాయకుడు రమేష్ వంఖ్వానీ చెప్పారు.
ఈ సంఘటన వెనుక ఎవరున్నారో తమకు తెలియదని, అయితే తమ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారన్నారు. ఆలయానికి నిప్పు పెట్టిన తర్వాత నలుగురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై పారిపోవడాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు చూసినట్లు చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే నలుగురు మోటారు సైకిళ్లపై పారిపోవడాన్ని తాము చూసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు సీనియర్ పోలీసు అధికారి నసీమ్ ఆరా పన్వహర్ తెలిపారు.
వాస్తవానికి సంఘటన జరిగిన చోట ఆలయం కాదని, విగ్రహాలుంచడానికి ఏర్పాటు చేసిన ఎత్తయిన గద్దె అని ఆమె అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకుని గద్దె చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను అక్కడ పెట్టవద్దని నిర్వాహకులకు చెప్పడం జరిగిందని, అయితే వారు ఆ సలహాను పట్టించుకోలేదని ఆమె డాన్ పత్రికకు తెలిపారు.
విధ్వంసకాండను రెచ్చగొట్టేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని హిందూ పంచాయత్ నాయకులు అన్నారు. వీలయినంత సంయమనం పాటించడం ద్వారా ఆ కుట్రలను భగ్నం చేస్తామని చెప్పినట్లు పత్రికలో వార్తలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కోల్హీ తెగకు చెందిన వారు ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో సందర్శిస్తూ ఉంటారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన రోజే సింధ్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి గ్యాన్చంద్ ఒక బృందాన్ని సంఘటన స్థలానికి పంపించారని మంత్రి సమీప బంధువైన మోహన్లాల్ చెప్పారు. మరోవైపు, హిందువులకు రక్షణ కల్పించాలని, దోషులను శిక్షించాలని కోరుతూ పలు జాతీయవాద పార్టీలకు చెందిన కార్యకర్తలు, హిందూ ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు జరిపారు.