మరో కుట్రకు తెరలేపిన చైనా: నేపాల్ వరకు హైవే, భారత్ ఆందోళన
న్యూఢిల్లీ/బీజింగ్: చైనా తన కుట్రలు, కుతంత్రాలను ఆపడం లేదు. ఏదో రకంగా భారత్ను ఇబ్బంది పెట్టేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా చైనా.. షిగాజే-షాంఘై-నేపాల్ వరకు హైవేను నిర్మించి భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. భారత్ను అనుకుని ఉన్న టిబెట్లో లాసా తర్వాత రెండో అతిపెద్ద నగరం షిగాజే. ఈ నగర విమానాశ్రయం నుంచి షిగాజే నగర నడి మధ్య వరకూ 40.4 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిని చైనా తాజాగా ప్రారంభించింది. షాంఘై నుంచి నేపాల్ సరిహద్దుల్లోని ఝాంగ్ము వరకూ విస్తరించిన 'జి318' హైవేతో ఈ కొత్త హైవే అనుసంధానం అవుతోంది.
చేరువలోనే..
జి318 రహదారికి సంబంధించిన మరో కొన.. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు చేరువలోని టిబెట్ పట్టణం నింగ్చీ వరకూ విస్తరించి ఉంది. అంటే చైనా హైవే భారత సరిహద్దు దాకా వచ్చిందన్నమాట! ఈ హైవేను పౌర, రక్షణ అవసరాలకు వినియోగించవచ్చు. ఆర్థిక, రక్షణ అవసరాల కోసం చైనా దక్షిణాసియాలోకి సునాయసంగా ప్రవేశించడానికి ఈ రహదారి వీలు కలిగిస్తుంది. ఈ రహదారి వెడల్పు 25 మీటర్లు. సాయుధ శకటాల తరలింపునకు ఇది అనువుగా ఉంది.
యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగొచ్చు..
అవసరమైతే యుద్ధవిమానాల కోసం రన్వేగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రహదారి గుండా అరుణాచల్ ప్రదేశ్కు అతి సమీపంలో చైనా సైనిక శకటాలు సంచరించడం భద్రతా కారణాల దృష్టితో చూస్తే భారత్కు ఆందోళన కలిగించే పరిణామం. అరుణాచల్ విషయంలో ఇప్పటికే భారత్-చైనా మధ్య వివాదం రగులుతోంది. తాజాగా హైవే నిర్మాణం ద్వారా సరిహద్దులో మౌలిక సదుపాయాల్ని చైనా బలోపేతం చేసుకుంది.
ఓలి వల్లే...
నేపాల్లో కెపి శర్మ ఓలి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశ సరిహద్దుతో రైల్వే లైనును అనుసంధానం చేయడానికి చైనా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. కె.పి.శర్మ ఓలి చైనాకు అనుకూలుడు. నేపాల్లో మధేసీల ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో.. భారత వస్తువులు నేపాల్లో ప్రవేశంపై దిగ్బంధం కొనసాగుతున్న సమయంలో.. చైనా వస్తువుల రవాణాకు మార్గం సుగమం చేయడం, భారత్పై ఆధారపడటాన్ని తగ్గించడం కోసం శర్మఓలి చైనాతో ఒప్పదం చేసుకున్నారు. నేపాల్ సరిహద్దుతో రైల్వేలైను అనుసంధానం ఈ ఒప్పందంలో కీలకమైనది. ఆ రైల్వే ప్రాజెక్టుకు సన్నాహకంగా తాజాగా హైవేను ప్రారంభించినట్లు చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్' వెల్లడించింది.
నమ్మబలుకుతున్న చైనా
భారత్ అంగీకరిస్తే భవిష్యత్తులో ఈ రహదారిని భారత్, భూటాన్, బంగ్లాదేశ్ల వరకూ విస్తరించవచ్చునని, ఇదో వాణిజ్య కారిడార్లాగా మారుతుందని చైనా చెబుతోంది. ఇప్పటిదాకా భారత్కు సన్నిహిత దేశంగా ఉన్న నేపాల్ను తనవైపు తిప్పుకోవడం, సరిహద్దులో మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేసుకోవడం ద్విముఖ లక్ష్యాలుగా హైవే, రైల్వే ప్రాజెక్టుల్ని చైనా చేపట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే భారత్ పై దాడి చేసేందుకు కూడా ఈ హైవేలు దోహదం చేస్తాయని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.