నేషనల్ డైలాగ్ క్వార్టెట్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
ఓస్లో: ట్యునీషియాకు చెందిన నేషనల్ డైలాగ్ క్వార్టెట్ సంస్థను 2015 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. బహుళ ప్రజాస్వామ్య నిర్మాణానికి కృషి చేసినందుకుగాను ఆ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు.
నార్వే పార్లమెంటు ఎంపిక చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఈ శాంతి బహుమతి విజేతను నిర్ణయించింది. ట్యూనీషియాలో 2011లో క్వార్టెట్ సంస్థ జాస్మిన్ రెవల్యూషన్ని చేపట్టింది. నిరుద్యోగం, ప్రభుత్వ లంచగొండితనం, సామాజిక అసమానతల నుంచి దేశాన్ని రక్షించేందుకు ఉద్యమాన్ని చేపట్టింది.
ఈ ఉద్యమం కారణంగా స్వేచ్ఛ, ప్రజాస్వామిక ఎన్నికలు జరిగాయి. కాగా, 273 మంది పోటీదారులను వెనక్కి నెట్టి క్వార్టెట్ సంస్థ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకుంది. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కల్, పోప్ ఫ్రాన్సిస్ కూడా అవార్డు పోటీలో ఉండటం గమనార్హం.
కాగా, నిరుడు బాలల హక్కుల ఉద్యమకర్తగా భారతీయుడైన కైలాస్ సత్యార్థి, బాలికల విద్య కోసం పోరాడిన పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్జాయ్లకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించిన సంగతి తెలిసిందే.
1901 నుంచి 2014 సంవత్సరం వరకు మొత్తం 95 నోబెల్ శాంతి బహుమతులను అందజేశారు. 128 మంది ఈ బహుమతులను అందుకున్నారు. రెండు శాంతి బహుమతులను ముగ్గురికి చొప్పున అందజేశారు. ఇప్పటివరకు 16మంది మహిళలు ఈ అవార్డును అందుకున్నారు.