కులభూషణ్ జాదవ్ కేసు: అంతర్జాతీయ కోర్టులో వాదనలు ప్రారంభం
కులభూషణ్ జాదవ్ ఉరి కేసుపై ఐసీజేలో సోమవారం వాదనలు కొనసాగుతున్నాయి. భారత్ తరఫున హరీష్ సాల్వే, పాకిస్తాన్ తరఫున అస్తర్ అలీ వాదనలు వినిపిస్తున్నారు.
న్యూఢిల్లీ: కులభూషణ్ జాదవ్ ఉరి కేసుపై ఐసీజేలో సోమవారం వాదనలు కొనసాగుతున్నాయి. భారత్ తరఫున హరీష్ సాల్వే, పాకిస్తాన్ తరఫున అస్తర్ అలీ వాదనలు వినిపిస్తున్నారు. జడ్జి ఇరు దేశాలకు 90 నిమిషాల సమయమిచ్చారు. హెగ్లోని గ్రేట్ హాల్లో వాదనలు కొనసాగుతున్నాయి.
జాదవ్ అమాయకుడు అని, ఆయన ఎలాంటి నేరాలకు పాల్పడలేదన్నారు. అతనికి విధించిన మరణశిక్షను వెంటనే నిలిపివేయాలన్నారు. జాదవ్కు శిక్ష ఏకపక్షమన్నారు. పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు.
పద్దెనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఐసీజేలో పోరు
నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్కు పాకిస్థాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో భారత్ ఈ నెల 8న సవాల్ చేసిన విషయం తెలిసిందే.
నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాక్లు తమ వాదనలు వినిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య దాదాపు 18 ఏళ్ల క్రితం ఇదే న్యాయస్థానంలో వేరొక కేసులో వాదనలు జరిగాయి.
పాకిస్థాన్ నావికాదళానికి చెందిన యుద్ధ విమానం అట్లాంటిక్ను కుచ్ ప్రాంతంలో 1999, ఆగస్టు 10న భారత వైమానిక దళం కూల్చేసింది. ఆ సంఘటనలో ఆ విమానంలో ఉన్న 16 మంది సిబ్బందీ మరణించారు.
తమ గగనతలంలో ఉండగా విమానాన్ని భారత్ కూల్చేసిందని ఆరోపించిన పాక్.. భారీ నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పాకిస్థాన్ పిటిషన్ను 14-2 తేడాతో 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 2000 జూన్ 21న కొట్టేసింది. ఆ తీర్పే ఆఖరు. దానిపై అప్పీలు లేదు. పాకిస్థాన్ దరఖాస్తును విచారించే పరిధి తనకు లేదని ఆ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆ కేసు విచారణ అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదని భారత్ చేసిన వాదనను మన్నించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిపి జీవన్ రెడ్డి, పాకిస్థాన్ మాజీ అటార్నీ జనరల్ సయద్ షరీఫుద్దీన్ పిర్జాదాను తాత్కాలిక న్యాయమూర్తులుగా ఆ ధర్మాసనంలోకి తీసుకున్నారు.
అంతర్జాతీయ న్యాయస్థానం నియమాల ప్రకారం కేసులో కక్షిదారులైన దేశాలకు చెందిన న్యాయమూర్తులు ధర్మాసనంలో లేకుంటే సంబంధిత దేశాలు తమ దేశానికి చెందిన వారిని తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించుకోవచ్చు.
కాగా, నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ గూఢచర్యానికి పాల్పడ్డారంటూ ఆయనకు పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం మరణ దండన విధించింది. ఆయన ఇరాన్లో వ్యాపారం చేసుకుంటుండగా అపహరించుకెళ్లి తప్పుడు అభియోగాలు మోపారని భారత్ ఆరోపిస్తోంది.