లాస్ వేగాస్: ఈ శతాబ్ధపు అత్యుత్తమ బౌట్లో అమెరికా యోధుడు ఫ్లాయిడ్ మేవెదెర్ చేతిలో ఓటమిపాలైన పిలిప్పీన్స్ బాక్సర్ మ్యానీ పకియావ్ క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు ఎదుర్కొనున్నాడు. మేవెదర్తో జరిగిన పోరు ముగిశాక స్వదేశానికి చేరుకున్న పకియావ్ ఎడమచేతి గాయంతో బాధపడుతూనే బౌట్ బరిలోకి దిగాననీ, అందుకే తాను ఓడిపోవాల్సి వచ్చిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
గాయం సంగతిని పకియావ్ పోటీకి ముందే తమకు చెప్పకపోవడంతో బాక్సింగ్ నిర్వాహకులు మండిపడుతున్నారు. ఇలా గాయం సంగతిని దాచిపెట్టి బరిలోకి దిగడం క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడడమేననీ, ఇందుకు అతను సరైన వివరణ ఇవ్వకపోతే అతనిపై చర్యలు తీసుకుంటామని నెవడా స్టేట్ అథ్లెటిక్ కమిషన్ చైర్మన్ ఫ్రాన్సిస్కో అగులార్ అన్నారు.
అంతేకాదు పకియావ్ ఆరోగ్యంగా లేకపోవడంతో తాము పూర్తి వినోదాన్ని కోల్పోయామన్న కారణం చూపుతూ టికెట్లు కొని పోరు చూసిన వారు నష్టపరిహారం కోసం కోర్టుని ఆశ్రయించే ఆస్కారంముందని తెలిపాడు. దీనిపై విచారిస్తున్నామనీ, పకియావ్ నుంచి సరైన సమాధానం రాకపోతే అతనిపై భారీ జరిమానా లేదా సస్పెన్షన్ విధించే అవకాశముందని ఫ్రాన్సిస్కో తెలిపారు.
ఇది ఇలా ఉంటే గాయంతో బరిలోకి దిగడంతో తాను విజయం సాధించలేకపోయానన్న పకియావ్ వ్యాఖ్యలకు విజేత ఫ్లాయిడ్ మేవెదెర్ స్పందించారు. పకియావ్ గనుక ఒప్పుకుంటే మరోసారి అతనితో పోటీపడేందుకు తాను సిద్ధమని మేవెదెర్ అన్నట్లు ఈఎస్పీఎన్ తెలిపింది.
మేవెదర్తో జరిగిన ఈ శతాబ్ధపు అత్యుత్తమ బౌట్లో పకియావ్ న్యాయనిర్ణేతల చేతిలో ఓడిపోయాడని కంబోడియా ప్రధాని హున్ సేన్ అన్నారు. తమ దేశస్ధుడైన మేవెదర్ కోసం న్యాయనిర్ణేతలు పక్షపాతంతో వ్వవహరించారని, పకియావ్ గెలుస్తాడని తాను కట్టిన 5 వేల డాలర్ల పందెం డబ్బులు కూడా ఇవ్వనని హున్ సేన్ తేల్చి చెప్పాడు.