పాక్ పైశాచికం: కిర్పాల్ గుండె, కాలేయం మాయం
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాకిస్థాన్ పైశాచికత్వం మరోమారు బయటపడింది. పాక్ జైల్లో దశాబ్దాలుగా మగ్గుతూ గతవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన క్రిపాల్ సింగ్ మృతదేహంలోని గుండె, కాలేయం తదితర అవయవాలను పాక్ మాయం చేసింది.
ముఖ్యమైన అవయవాలు లేని క్రిపాల్ మృతదేహాన్ని భారతదేశానికి పంపింది. క్రిపాల్ సింగ్ మృతదేహానికి పరీక్షించిన భారత వైద్యులు ఈ మేరకు గుర్తించారు. కాగా, పాకిస్థాన్లోని లాహోర్లోని కోట్ లఖ్పత్ కారాగారంలో ఏప్రిల్ 11న క్రిపాల్ మరణించిన సంగతి తెలిసిందే.
'దేశం కోసం మా అంకుల్ ప్రాణాలను వదిలారు. సరబ్ జిత్ హత్య కేసులో ఆయనొక్కడే సాక్ష్యం. సరబ్ ఎలా మరణించాడో బయటకు తెలియకుండా చేసేందుకే పాక్ ప్రభుత్వం ఆయన్ను చంపించింది' అని క్రిపాల్ కోడలు అశ్వని ఆరోపించారు.
కిర్పాల్ను హత్య చేశారని, ఇది బయట పడుతుందన్న భయంతోనే అవయవాలు మాయం చేశారని క్రిపాల్ కుటుంబసభ్యులు ఆరోపించారు. జైలులో అతడిని చిత్రహింసలు పెట్టారని వాపోయారు.
కిర్పాల్ మృతదేహాన్ని మంగళవారం పంజాబ్ లోని స్వస్థలానికి తరలించారు. కిర్పాల్ సింగ్కు విషం ఇచ్చి చంపివుంటారని సరబ్ జిత్ సింగ్ సోదరి దబ్లీర్ కౌర్ అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, మరోసారి పోస్టు మార్టం చేయాలంటే, శరీరంలోని ప్రధాన అవయవాల అవసరం ఉంటుందని, అందువల్లే అవయవాలు లేని శరీరాన్ని పాక్ పంపిందని వైద్యులు తెలిపారు.
2013లో లాహోర్ జైల్లో మృతి చెందిన సరబ్ జీత్ సింగ్ విషయంలోనూ పాకిస్థాన్ ఇలాగే దుర్మార్గంగా వ్యవహించింది. స్వదేశానికి తరలించిన సరబ్ జీత్ సింగ్ భౌతికకాయంలో కీలక అవయవాలు లేనట్టు అప్పట్లో గుర్తించారు.