అవును.. భారత్ సైన్యం దాడి చేసింది, మేం కూడా: పాక్ రక్షణ మంత్రి, నీరసంగా..
కరాచీ: భారత సైన్యం దాడులను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇప్పటికే ఖండించారు. ఆ తర్వాత పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ కూడా స్పందించారు. భారత సైన్యం నియంత్రణ రేఖను ఉల్లంఘించి తమ భూభాగంలోకి వచ్చిందని, తమ సైన్యం కూడా దీనికి తగిన సమాధానం చెబుతుందన్నారు.
తమ సైనికులు ఇద్దరు మరణించారన్నారు. తొమ్మిది మందికి గాయాలు అయ్యయాని చెప్పారు. కాగా, ఇంతకుముందు తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పేటప్పుడు మంచి ధీమాగా కనిపించిన ఖ్వాజా.. ఇప్పుడు మాత్రం చాలా నీరసంగా కనిపించారని అంటున్నారు.
పాకిస్తాన్ సైన్యం మాత్రం అసలు భారత సైన్యం దాడులే చేయలేదని అంటోంది. సరిహద్దుల వెంబడి జరిగే కాల్పులను భారత సైన్యం సునిశిత దాడులని అబద్దాలు చెబుతోందని పాకిస్తాన్ భూభాగం మీద అలాంటి దాడులు జరిగితే దానికి తగిన సమాధానం చెబుతామని పాకిస్తాన్ సైన్యం చెప్పింది.
కాగా, యూరీ ఉగ్ర ఘటన తర్వాత పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన తొలి భారీ సర్జికల్ స్ట్రైక్ (ఆర్మీ దాడి)పై ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొరుగు దేశంతో శాంతియుతంగా మెలగాలన్న ఆలోచనను తమ బలహీనతగా భావించవద్దని హెచ్చరించాడు. పాకిస్తాన్ సమగ్రతను కాపాడేందుకు అక్కడి భద్రతా బలగాలు పూర్తి సంసిద్దతో ఉన్నాయన్నాడు. ఎల్వోసీ పైన భారత సైన్యం చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.