చైనా గర్ల్ ని కాక్పిట్లోకి పిలిచి.. రెండు గంటలపాటు.. ఆ పైలట్ ఏం చేశాడంటే..
మొన్నటికి మొన్న ఓ పైలెట్ ఏకంగా 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్న విమానాన్ని శిక్షకులకు అప్పగించి గాఢ నిద్రలోకి జారుకోగా.. తాజాగా షాజద్ అజీజ్ అనే పైలట్ ఏకంగా ఓ చైనా ప్యాసింజర్ ని కాక్పిట్లోకే పి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్(పీఐఏ) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటనతో మరోసారి వివాదంలోకి వెళ్లింది. పైగా తప్పును ఒప్పుకోకుండా సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
మొన్నటికి మొన్న ఓ పైలెట్ ఏకంగా 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్న విమానాన్ని శిక్షకులకు అప్పగించి గాఢ నిద్రలోకి జారుకోగా తాజాగా షాజద్ అజీజ్ అనే పైలట్ ఏకంగా ఓ చైనా ప్యాసింజర్ ని కాక్పిట్లోకే పిలిపించుకొని కబుర్లాడాడు.
సదరు చైనా యువతి ఏకంగా రెండు గంటలపాటు కాక్పిట్లోనే ఉండి.. విమానం సరిగ్గా బీజింగ్లో ల్యాండ్ అయ్యే సమయంలో బయటకు వచ్చింది. కాక్పిట్లో ఈ అమ్మాయి ఉన్న సమయంలో బయట విమాన సిబ్బంది కాపలా కూడా కాయడం గమనార్హం.
పాక్కు చెందిన ఈ విమానం టోక్యో నుంచి బీజింగ్ వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. కాక్ పిట్ లోంచి ఆమె బయటకు రావడాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు అవాక్కయ్యి ఆ చైనా యువతిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
విమానంలో ప్రయాణం బాగా సాగిందా? పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఎలా అనిపించింది? మీరు కాక్పిట్లోకి ఎందుకెళ్లారు? పైలెట్ మీ బంధువా? స్నేహితుడా? మీకు తెలిసినవాడా? అని ప్రశ్నిస్తూ వీడియో తీయడం మొదలుపెట్టాడు.
చైనా యువతి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆ ప్రయాణికులు వీడియో కూడా తీయడం గమనించి ఆ విషయంపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో విమాన సిబ్బంది అతడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆ ప్రయాణికుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'నోర్మూసుకుని ఉండండి.. లేదంటే ఇక్కడ జరిగిందంతా ఫిర్యాదు చేస్తా..'అంటూ అతడు హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది. దీనిపై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సమాధానం చెబుతూ.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, సిబ్బంది ఇంకా బీజింగ్లోనే ఉన్నారని, 'అయినా ఒక ప్యాసింజర్ కాక్పిట్లోకి వెళితే పెద్ద తప్పేం లేదు కదా..' అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసింది.