ఒబామా భారత్ టూర్పై చైనా తేలిగ్గా..: పాక్ మిత్రదేశమని కితాబు
ఇస్లామాబాద్/బీజింగ్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా భారత పర్యటనను చైనా తేలిగ్గా తీసుకుంది. ఒబామా పర్యటన ద్వారా భారత్, అమెరికా బంధం మరింతగా దృఢపడుతున్నాయన్న వాదనలతో చైనా ఏకీభవించలేదు. అందుకు ఒబామా తన పర్యటనను కుదించుకోవడాన్నే చైనా నిదర్శనంగా చూపింది.
ఒబామా తొలి షెడ్యూలులో తాజ్ మహల్ సందర్శించాల్సి ఉంది. కానీ, సౌదీ అరేబియా రాజు మృతి చెందడంతో తాజ్ పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ పత్రికలు కూడా ఒబామా పర్యటన పైన స్పందించాయి. ఉద్దేశ్యపూర్వకంగా భారతదేశం తీవ్రవాదం పేరుతో పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుంటోందని పత్రికలు ఆరోపించాయి.
పాక్ మా మిత్ర దేశం: చైనా
పాకిస్తాన్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశమని చైనా సోమవారం ప్రకటించింది. తమ దేశంలో పర్యటిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్తో భేటీ సందర్భంగా చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యి పైవిధంగా వ్యాఖ్యానించారు. ఒబామా భారత్ పర్యటనలో ఉండగా చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.
భారత్, చైనాలకో గ్లోబల్ టైమ్స్ హెచ్చరిక
పాశ్చాత్య దేశాలు సృష్టించిన పోటీ ఉచ్చులో పడొద్దని చైనా అధికార దినపత్రిక గ్లోబల్ టైమ్స్ భారత్, చైనాలను హెచ్చరించింది. నిగూఢ ఉద్దేశ్యాలతో పాశ్చాత్య ప్రపంచం ఈ రెండు దేశాలను సహజ ప్రత్యర్థులుగా ప్రచారం చేస్తోందని ఆరోపించింది.
చైనా ఎదుగుదలను అడ్డుకోవడానికి అమెరికా వ్యూహానికి మద్దతు పలకవద్దని కోరింది. భారత్, చైనాలు ఒకరిని దెబ్బతీసి మరొకరు లాభపడే పోటీని కోరుకోవడం లేదని పేర్కొంది. అయితే, పాశ్చాత్య దేశాల ప్రభావంతో భారత్ ఆ పోటీ వైపు సాగుతోందని వ్యాఖ్యానించింది.