దుర్వినియోగమంటూ..: చైనాకు షాకిచ్చిన పాకిస్థాన్
తమకు చిరకాల మిత్రుడిగా పేర్కొంటున్న పాకిస్థాన్.. చైనాకు షాకిచ్చింది.చైనా జాతీయుల వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది.
ఇస్లామాబాద్: తమకు చిరకాల మిత్రుడిగా పేర్కొంటూ పాకిస్థాన్లో భారీగా పెట్టుబడులు పెడుతూ, యుద్ధ సామాగ్రిని సమకూరుస్తున్న చైనాకు ఆ దేశం షాకిచ్చింది. చైనా జాతీయుల వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది.
పాకిస్థాన్లో పర్యటించాలనుకునే చైనా జాతీయుల కోసం కొత్త వీసా నిబంధనలను ఆ దేశ హోంశాఖ బుధవారం జారీ చేసింది. కల్లోలిత బెలూచిస్థాన్లో ఇద్దరు చైనీయులు అపహరణకు, ఆ తర్వాత హత్యకు గురవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి.
కాగా, ఇద్దరు చైనీయులు బిజినెస్ వీసాలను దుర్వినియోగం చేసి, తమ దేశంలో క్రైస్తవాన్ని ప్రచారం చేశారని పాక్ చెబుతోంది. ఈ క్రమంలో తమ సైన్యాన్ని పంపి పాక్లో ఉగ్రవాదులు లేకుండా చేయాలని చైనీయులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో ఉద్యోగం, వ్యాపారం కోసం వచ్చే చైనీయులకు సంబంధించిన వీసా నిబంధనలను ఆ దేశం కఠినతరం చేసింది. ఈ నిబంధనల ప్రకారం పాక్ బిజినెస్ వీసాలు కావాలంటే.. చైనాలోని పాక్ ఎంబసీ గుర్తించిన సంస్థ నుంచి ఆహ్వానం పొందాల్సి ఉంటుంది.
పాక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనుమతితోపాటు పలువురు చైనా అధికారుల అనుమతి ఉంటేనే ఆ దేశవాసులకు బిజినెస్ వీసాలు ఇస్తామని పాకిస్థాన్ స్పష్టం చేసింది. వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పాక్ తెలిపింది.