అభిమానినంటూ టీవీ యాంకర్కు విషం కలిపిన ఐస్ క్రీం ఇచ్చాడు
కరాచీ: తాము అభిమానించే సినిమా తారలు, టీవీ యాంకర్స్ కనిపిస్తే ఎవరైనా ఫోటోలు లేదా సెల్ఫీలు దిగేందుకు, చేయి కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, పాకిస్తాన్లో ఒక యువకుడు తాను అభిమానిని అని చెప్పి పాక్ టీవీ యాంకర్కు విషం కలిపిన ఐస్ క్రీం ఇచ్చాడు.
సదరు యువకుడు తనకిష్టమైన టీవీ యాంకర్కు ఐస్క్రీం ఇచ్చి ఏకంగా ఆమె ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. పాకిస్థాన్లోని కరాచీ సమీపంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సనా ఫైసల్ ప్రముఖ ఉర్దూ ఛానెల్లో ఖుఫియా అనే టీవీ షోలో యాంకర్గా పని చేస్తున్నారు. ఆదివారం ఆమె భర్తతో కలిసి నజీమాబాద్లోని పెషావరీ ఐస్ క్రీం పార్లర్కు వెళ్లారు. అక్కడ అభిమానినంటూ ఓ పదిహేనేళ్ల వ్యక్తి ఎదురయ్యాడు. ఆమె ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఫోటో దిగాడు.
ఆ తర్వాత ఐస్ క్రీం ఇచ్చాడు. అభిమాని ఇచ్చిన ఐస్క్రీంని ఆమె తిని ఇంటికి వెళ్తూ.. మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యారు. భర్త ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఆమె తిన్న ఐస్క్రీంలో విషం కలిసిందని తేలింది. ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఎవరు, ఎందుకు ఇచ్చారనే కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు.