భారత్తో మంచి సంబంధాలే, కాశ్మీర్ సహా పరిష్కారం: నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ముగిసిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తమ పక్కన ఉండే భారత దేశంతో ఎప్పుడు కూడా సాధారణ సంబంధాలు కోరుకుంటోందని షరీఫ్ అన్నారు.
తమ దేశం ఎప్పుడు కూడా ఇతర దేశాలతో మంచి సంబంధాలనే కోరుకుంటోందన్నారు. భారత్లో పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బస్తీతో షరీఫ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ... పాకిస్తాన్కు భారత్ ముఖ్యమైన పక్క దేశమన్నారు.
బస్తీ బుధవారం నాడు నవాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. ఇస్లామాబాద్, న్యూఢిల్లీల మధ్య ప్రస్తుత పరిస్థితిని ఆయనకు వివరించారు.
భారత దేశంతో సాధారణ సంబంధాలను తాము కోరుకుంటున్నామని షరీఫ్ వ్యాఖ్యానించారు. పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం ప్రాతిపదికన మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇరు దేశాలు కూడా జమ్మూ కాశ్మీర్ సహా అన్ని సమస్యను పరిష్కరించుకోవాలని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారని సమాచారం.