పాకిస్తాన్లో కూలిపోయిన విమానం: ప్రఖ్యాత సింగర్ సహా 48 మంది మృతి?
పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. హవేలియన్ పిప్లియన్ వద్ద ఈ విమానం కూలింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. హవేలియన్ సబర్బన్ గ్రామం పిప్లియన్ వద్ద ఈ విమానం కూలింది. ఈ ఘటనలో 48 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
ఈ విమానం ఉత్తరాది పట్టణమైన చిత్రాల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అయింది. విమానంలో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. 6గురు క్యాబిన్ క్రూ ఉన్నారు. ఇస్లామాబాద్ వెళ్తున్న వెళ్తోంది. బయలుదేరిన కాసేపటికే రాడార్ నుంచి విమానానికి సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కూలిపోయినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
విమానంలో 9 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు విదేశీయులతో సహా మొత్తం 48 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఓ ప్రఖ్యాత గాయకుడి కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. విమానం నేల కూలి మంటల్లో చిక్కుకుందని, ఎవరూ బతికుండే అవకాశంలేదని సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు చెబుతున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అబొటాబాద్ ప్రాంతంలో రాడార్తో సంబంధాలు తెగిపోయింది.