రాజీవ్ గాంధీ రష్యాకు దూరం కావాలనుకున్నారా?
వాషింగ్టన్: రష్యాతో భారత్ సన్నిహితంగా ఉన్నట్లు కనిపించినా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఆఫ్గనిస్తాన్లో అగ్రదేశం జోక్యం పైన నాటి ప్రధాని రాజీవ్ గాంధీ విముఖంగా ఉన్నారని అమెరికా గూఢచార సంస్థ సిఐఏ పేర్కొంది.
ఆప్ఘన్ నుంచి పాకిస్తాన్లోను పాగా వేయాలని భావిస్తే దక్షిణాసియాలో జోక్యం చేసుకోకుండా రష్యాను నిలువరించాలని ఆయన భావించినట్లు తెలిపింది.
ఇందుకోసం అవసరమైతే పాకిస్తాన్లోని రష్యా వ్యతిరేక పౌర బృందాలకు మద్దతు ఇచ్చే అంశాన్ని రాజీవ్ గాంధీ పరిశీలించినట్లు తెలిపింది.
ఆప్ఘన్లో సోవియెట్ జోక్యం.. అమెరికా సహా ప్రాంతీయ దేశాల్లో చిక్కులు పేరిట 1985 అక్టోబర్ 21న రూపొందించిన పత్రాలను రహస్య జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో సిఐఏ ఇటీవల వీటిని వెబ్ సైట్లో పెట్టింది.
పాకిస్తాన్ అణ్వస్త్రాలపై ఇందిరా గాంధీ
పాకిస్తాన్పై సైనిక దాడికి పాల్పడి, ఆ దేశం భద్రపరచుకున్న అణ్వస్త్రాలను ధ్వంసం చేయాలనే అంశాన్ని అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ పరిశీలించారా? సిఐఏ పత్రాలు ఇందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అంతకుముందు ఇందిరా గాంధీ 1980లో తిరిగి అధికారంలోకి వచ్చాక పాక్ అణ్వస్త్రాలను ధ్వంసం చేయాలనే అంశాన్ని పరిశీలించారని సిఐఏకి చెందిన అప్పటి పత్రాలు వెల్లడించాయి.
పాకిస్తాన్ అణ్వస్త్రాలను సేకరించకుండా నిరోధించేందుకు వాటిని భద్రపరిచే గిడ్డంగులను సైనిక దాడితో ధ్వంసం చేయాలనే అంశాన్ని 1980లో తిరిగి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇందిరా గాంధీ పరిశీలించారని సిఐఏ పత్రాలు వెల్లడించాయి.