పాక్, చైనాతో స్నేహమే కావాలి, కానీ: రాజ్నాథ్, నేతాజీ ఫైళ్లపై తొందరొద్దు!
శ్రీనగర్: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం నాడు జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా, పాకిస్తాన్ సంబంధాల పైన మాట్లాడారు. భారత్ ఎప్పుడు కూడా ఆ రెండు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటోందన్నారు.
సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో సత్సంబంధాల్నే తాము కోరుకుంటున్నామని చెప్పారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సోమవారం చేరుకున్నారు. ఉదయం జమ్మూ విమానాశ్రయంలో దిగిన ఆయన అనంతరం సరిహద్దు జిల్లా అయిన సాంబకు వెళ్లారు.
అక్కడ ఐటీబీపీ కాంప్లెక్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సరిహద్దు భద్రతపై జవాన్లను ఆరా తీశారు. సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించుకునేందుకు తామెప్పుడూ కృషి చేస్తున్నామన్నారు.
అదే సమయంలో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన పైన ఆయన మండిపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఇలాంటి సమయంలో రాజ్ నాథ్ సింగ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
నేతాజీ ఫైళ్ల పైన మాట్లాడుతూ.. స్వతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైళ్ల పైన కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అందరు ఓపిగ్గా ఉండాలని, ప్రజల ముందుకు ఎప్పుడు రహస్య పత్రాలు రావాలో అప్పుడు వస్తుందన్నారు.