తెలుగు టెక్కీలపై కాల్పులు: అమెరికా మీడియా ఇలా...
తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల మృతికి కారణమైన కాన్సాస్ ఘటనలపై అమెరికా మీడియా వార్తాలను ప్రచురించింది. ఈ వార్తలు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరమైన విషయమే..
కన్సాస్ : అమెరికాకు చెందిన వ్యక్తి కన్సాస్లోని ఓ బార్లో తెలుగు ఇంజనీర్లపై కాల్పులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో కూచిభొట్ల శ్రీనివాస్ అనే ఇంజనీరు మరణించగా, మాడాసాని ఆలోక్ రెడ్డి గాయపడ్డాడు. ఈ ఘటనపై అమెరికా మీడియా ఎలా స్పందించిందనేది ఆసక్తికరమైన విషయమే.
భావోద్వేగాలను ప్రకటించకుండా అత్యంత సంయమనంతో అమెరికా మీడియా కాన్సాస్ ఘటన వార్తను ప్రచురించింది. ఇది విద్వేషపూరితమైన దాడిగా దాన్ని చెప్పలేదు. అయితే ఊహాగానాలకు మాత్రం అవకాశం కల్పించింది. మృతుడికి, క్షతగాత్రుడికి, కాల్పులు జరిపిన వ్యక్తికి, ప్రస్తుతం హీరోగా నిలిచిన వ్యక్తి కి సంబంధించిన ప్రాథమిక వివరాలు మాత్రమే అమెరికా మీడియాలో ఇస్తున్నారు.
సీఎన్ఎన్, ది హఫింగ్టన్ పోస్ట్, అల్ జజీరా వంటి వార్తా మాధ్యమాలు వాటి సంప్రదాయాల ప్రకారం ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ అనే పద్ధతిలో మాత్రమే ఈ సంఘటన గురించి వార్తలు ఇచ్చాయి. గ్రిల్లట్ మాటలను, సుష్మా స్వరాజ్ ట్వీట్లను వివరించారు.
బార్లో ఇలా కాల్పులు...
తెలుగు ఇంజనీర్లు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసాని బార్లో ఉన్న సమయంలో ఆడం పురింటన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మరణించగా, అలోక్ గాయాలతో బయటపడ్డారు. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి హంతకుడిని పట్టుకున్న ఇయాన్ గ్రిల్లట్ను హీరోగా కొనియాడుతున్నారు.
న్యూయార్క్ టైమ్స్ ఇలా ఇ్చచింది...
న్యూయార్క్ టైమ్స్ అమెరికాలో అతి ముఖ్యమైన పత్రిక అనే విషయం తెలిసిందే. దీనిలో కన్సాస్ కాల్పుల ఘటనను ఇండియా ఖండించిన విధానాన్ని ప్రచురించారు.. ఆడం పురింటన్ గురించి వివరించారు. భారత్, అమెరికా సంబంధాలపై ఉంటుందా ఈ ఘటన ప్రభావం ఉంటుందా అనే కోణంలో ఓ వ్యాసం రాశారు.
ట్రంప్ పాలసీలపై సంకేతాలు ఇచ్చారు...
న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ట్రంప్ పాలనలో అమెరికాలో విద్వేష నేరాలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. హెచ్1బీ వీసాల జారీ విధానంపై ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని రాశారు. హెచ్1బీ వీసాలతో వేలాదిమంది ఇండియన్ టెక్నాలజీ వర్కర్లు అమెరికా వచ్చారని పేర్కొన్నారు. ఈ వీసాల జారీ విదానాన్ని కఠినతరం చేయబోతున్నట్లు వార్తలు వస్తుండటంతో ఇండియాలో ఆందోళన మొదలైందని చెప్పారు. భారతీయ యువత అమెరికాలో చదవాలని, ఉద్యోగం చేయాలని కలలు కంటుందని రాశారు. శ్రీనివాస్పై దాడిని ఖండించేందుకు లేదా సమర్థించేందుకు ట్రంప్ ఎటువంటి ప్రయత్నం చేయలేదని రాశారు.
వాషింగ్టన్ పోస్ట్ కాస్తా వివరంగా..
వాషింగ్టన్ పోస్ట్లో కాస్త వివరంగా కాన్సాస్ సంఘటన గురించి ప్రస్తావించింది. అలోక్ మాడసాని తండ్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా ప్రచురించింది. తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికాకు పంపించవద్దని ఆయన కోరిన విషయం తెలిసిందే. దాన్ని పత్రిక ప్రచురించింది.
స్థానిక పత్రిక మాత్రం చాలా..
కన్సాస్ సిటీలోని స్థానిక పత్రిక సంఘటన గురించి చాలా వివరాలు ప్రచురించింది. కూచిభొట్ల ప్రొఫైల్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల వివరాలను కూడా ప్రచురించింది. రెండో ‘గో ఫండ్ మి' కాంపెయిన్లు, శ్రీనివాస్ పని చేస్తున్న గార్మిన్ కంపెనీ ప్రతినిధుల ప్రకటనలు, గార్మిన్ ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్లో శ్రీనివాస్ కూచిభొట్ల ఇంజినీరుగా చేసేవారు. ఆయన మృతిపట్ల స్థానికులు ఎంతగా బాధపడుతున్నారో కూడా ఈ పత్రికలో రాశారు.