డోక్లామ్లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై అమెరికా హెచ్చరిక.. ఏ క్షణంలో అయినా
భారత్-చైనా దేశాలు యుద్ద ఆలోచన కాకుండా.. సమస్యను పరిష్కరించుకునే సమాలోచన చేయాలని తాజాగా అమెరికా రక్షణ విభాగం సూచించింది.
వాషింగ్టన్: భారత్-చైనా సరిహద్దు వివాదం నానాటికీ ముదరుతుందే తప్ప సద్దుమణగడం లేదు. వెనక్కి తగ్గని చైనా దుందుడుకు వైఖరికి భారత్ కూడా ధీటుగా బదులిస్తుండటంతో ఇరు దేశాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి.
ఇక యుద్ధమే, మీ ఓటమి ఖాయం, ఇదీ మా లెక్క, భారత్ భయపడింది: సుష్మా వ్యాఖ్యలపై చైనా సంచలనం
ఇరు దేశాల సరిహద్దు వివాదంపై ఓ కన్నేసి ఉంచిన అమెరికా పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై ఆ దేశం మరోసారి స్పందించింది. భారత్-చైనా మధ్య యుద్దం జరిగితే అది ఇరు దేశాలకు నష్టమేనని స్పష్టం చేసింది.
కబళించే ఎత్తుగడ: ఇండియాపై చైనా దూకుడు వెనుక.. ఇదీ అసలు కుట్ర?
ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో అయినా యుద్దం ముంచుకు రావచ్చునన్న ఉద్దేశంతో.. చైనా ప్రభావాన్ని నియంత్రించే పనిలో పెంటగాన్ బృందం నిమగ్నమైపనట్లుగా ఓ టాప్ కమాండర్ వెల్లడించడం గమనార్హం.
చర్చలే సరైన నిర్ణయం:
భారత్-చైనా దేశాలు యుద్ద ఆలోచన కాకుండా.. సమస్యను పరిష్కరించుకునే సమాలోచన చేయాలని తాజాగా అమెరికా రక్షణ విభాగం సూచించింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి గ్యారీ రోస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చైనా తమ సైన్యాన్ని ఆధునీకరించడంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లో సరిహధ్దు దేశాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు గ్యారీ రోస్ తెలిపారు. కొద్దిరోజుల క్రితం దీనిపై తొలిసారి స్పందించిన అమెరికా.. చైనా ఎత్తుగడల వెనుక దురాక్రమణ వ్యూహమే కారణమని తెలిపిన సంగతి తెలిసిందే.
డోక్లాంలో ఏం జరుగుతోంది?:
భూటాన్ తమ భూభాగం అని చెప్పుకుంటున్న డోక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం పేరిట భారత భూభాగంలోకి చొచ్చుకొస్తుందని మన సైన్యం ఆరోపిస్తోంది. అదే సమయంలో భారతే తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తోందని అటు చైనా కూడా వాదిస్తోంది. ఎవరికి వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండటంతో వివాదం ముదురుతూనే ఉంది.
మధ్యలో భారత్ ఎందుకంటున్న చైనా:
అసలు డోక్లాం వివాదమనేది చైనా-భూటాన్ కు సంబంధించిందని మధ్యలో భారత్ ప్రమేయం ఎందుకని చైనా ప్రశ్నిస్తోంది. అయితే రాయల్ భూటాన్ ఆర్మీ ఫిర్యాదు మేరకే తాము స్పందించి.. రోడ్డు నిర్మాణం ఆపివేయాల్సిందిగా కోరామని భారత్ స్పష్టం చేసింది.
కాగా, డోక్లాం ప్రాంతం చుంబీ వ్యాలీని భారత్(సిక్కిం), చైనా, భూటాన్ల సరిహద్దులు కలిసే ప్రాంతంలో ఉండటంతో వివాదంలో భారత్ కూడా అనూహ్యంగా ప్రవేశించింది.
డోక్లాం ఎవరిది?:
డోక్లాం పీఠభూమిపై భూటాన్-చైనా మధ్య పేచీ నడుస్తోంది. 1890 ఆంగ్లో-చైనీస్ కన్వెన్షన్ ప్రకారం అది టిబెట్లో భాగంగా ఉంది. ఆ ఒప్పందంలో ఎటువంటి ప్రమేయం లేని భూటాన్ మాత్రం అది తమదేనని వాదిస్తోంది. టిబెట్ ఆక్రమణ తర్వాత చైనా ఇప్పుడక్కడ పాగా వేసింది.
చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పట్ల అభ్యంతరాలున్న భూటాన్.. ఇందుకు సహరించాల్సిందిగా భారత్ ను కోరడంతో.. వివాదంలోకి భారత సైన్యం ప్రవేశించినట్లయింది. దీంతో భారత్ అనవసరంగా కలగజేసుకుంటుందని చైనా వాదిస్తోంది.
చర్చలకు అజిత్ దోవల్:
బీజింగ్ లో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు హాజరయ్యే సందర్భంలో భారత్-చైనా సరిహద్దు సమస్యపై కూడా చర్చించాలని భారత్ భావిస్తోంది. ఈ మేరకు భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అక్కడికి వెళ్లనున్నారు. డోక్లామ్ వివాదంపై చైనా ప్రతినిధులతో ఆయన చర్చించనున్నారు.
కాగా, సరిహద్దు దేశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి భారత్-చైనాలు గతంలోనే ఓ వేదికను ఏర్పాటు చేసుకున్నాయి. ఇరు దేశాల ప్రతినిధులతో ఈ యంత్రాంగం ఏర్పాటైంది.