శుక్రవారం గాల్లోనే మండిపోనున్న రష్యా స్పేస్ కార్గోషిప్: శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ: అదుపు తప్పి, నియంత్రణ కోల్పోయిన రష్యా స్పేస్ కార్గోషిప్ ఈ శుక్రవారం భూమికి చేరుతుందని, అది పూర్తిగా వాతావరణంలోనే మండిపోనుందని రష్యా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తున్న వ్యోమగాముల కోసం ఆహారం, నీరు సహా అవసరమైన సరుకులతో రష్యా ఈ మానవరహిత కార్గో షిప్ను అంతరిక్షంలోకి పంపించిన సంగతి తెలిసిందే.
అది ప్రయోగించిన కొద్ది గంటలలోనే అదుపు తప్పిన స్పేస్ కార్గోషిప్ భూమి వైపుకి దూసుకొస్తుందని, నియంత్రించే స్ధితిలో లేదని, భూమిని తాకుతుందని ఇటీవేల శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో మే 8వ తేదీన(శుక్రవారం) ఉదయం 1.23 నుంచి రాత్రి 9.55 వరకు ఏ సమయంలోనైనా మండిపోతుందని రష్యా స్పేస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.
తొలుత పసిఫిక్ సముద్రంలో పడిపోతుందని అంచనా వేసినా.. తాజాగా స్పేస్ కార్గోషిప్ పూర్తిగా గాల్లోనే మండిపోతుందని చెబుతున్నారు. భూమి పైకి స్పేస్ కార్గోషిప్కు సంబంధించిన చిన్న చిన్న ముక్కులు మాత్రమే వచ్చి పసిఫిక్ సముద్రంలో పడతాయని పేర్కొన్నారు.