టెక్నాలజీ షాక్: కారు నీడ మార్జిన్ దాటినా జరిమానే!
మాస్కో: సాధారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిబంధనలు ఉల్లంఘించినా, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపినా పోలీసులు జరిమాన విధిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ప్రయాణికుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఈ నిబంధనలు అమలు చేస్తుండటం వల్ల అందరూ సమర్థించాల్సిందే.
అయితే, రోడ్డుపై నియంత్రణ గీత(మార్జిన్) దాటి వాహనాల నీడ సైతం వెళ్లకూడదనే నిబంధనలను కూడా అమలు చేస్తున్నాయి అత్యాధునిక సాంకేతిక పరికరాలు. వీటితో ఎంతో ఉపయోగం ఉన్నా.. వాహనాల నీడను, వాటి లైట్ల కాంతిని కూడా పరిగణలోకి తీసుకుంటుండటంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి రష్యా వాహనదారులకు, పోలీసులకు కూడా.
ఆ వివరాల్లోకి వెళితే.. రష్యాలోని మాస్కో రింగురోడ్డుపై కారు వెళ్తుండగా.. దాని నీడ రోడ్డు మధ్యలో ఉన్న క్రాసింగ్ లైన్ను దాటింది. ఇదంతా ట్రాఫిక్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఆ రికార్డింగు ఆధారంగా కంప్యూటర్ ఆధారిత జరిమానా నోటీసు ఆ కారు యజమాని ఇంటికి చేరింది. మరి నిజంగానే కారు నీడ క్రాసింగ్ లైన్ను దాటినా ఫైన్ వేస్తారా? అంటే అలా ఏమీ ఉండదు.
కానీ, కారు క్రాసింగ్ లైన్ను దాటితే మాత్రం జరిమాన తప్పక కట్టాల్సిందే. అయితే ప్రస్తుతం కారు నీడను రికార్డు చేసిన సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల ఇది తలెత్తింది. తన కారు గీత దాటలేదని.. ఆ సీసీ కెమెరా రికార్డులను చూపించి పోలీసులకు తెలియజేశాడు ఆ వాహన యజమాని. దీంతో అతనికి జరిమానా తప్పింది.
కాగా, ఇలాంటి సంఘటనే మరోటి కూడా జరిగింది. కారు హెడ్లైట్స్ వెలుతురు క్రాసింగ్ లైన్ దాటి పడటం వల్ల జరిమానా కట్టాలని నోటీసు అందింది. అది కూడా సాంకేతిక లోపం వల్లే జరిగడం గమనార్హం. ఇలాంటి ఘటనలు సాంకేతిక లోపం వల్లే జరిగినా ఈ పరికరాలు వాహనాల నీడను, లైట్ల కాంతిని కూడా క్రాసింగ్ లైన్ను దాటకుండా చూస్తున్నాయంటే వాటి సామర్థ్యం ఏపాటిదో అర్థమవుతోంది.