న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ పోరులో విజేతగా నెగ్గిన అమెరికా దిగ్గజం ప్లాయిడ్ మేవెదర్, ఫిలిప్పీన్స్ పకియావ్ మధ్య లాస్ వేగాస్లో జరిగిన బౌట్ విమర్శలకు తావిస్తోంది. ఈ బౌట్పై ఫిలిప్పీన్స్లోని పకియావ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ పోటీలో పకియావ్ మొదటి నుంచి మంచి ఆధిపత్యం కనబర్చాడని, అలాంటప్పుడు మేవెదర్ను న్యాయనిర్ణేతలు విజేతగా ఎలా ప్రకటిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ బౌట్ కోసం ఫిలిప్పీన్స్లోని చాలా థియేటర్లలో, పార్కులు, హోటళ్లలో భారీ తెరలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ బౌట్ ముగిసిన తర్వాత పకియావ్ అభిమానులు ఫిలిప్పీన్స్ రోడ్లపై నిరసన చేపట్టారు. ఇక దీనిపై ఫిలిప్పీన్స్ చట్ట సభ సభ్యుడు అలెక్సీ నోగ్రాలెస్ మాట్లాడుతూ మేవేదర్ స్వదేశంలో జరిగిన బౌట్ కాబట్టి, న్యాయనిర్ణేతల నిర్ణయం అతడికి అనుకూలంగా రావడంతో ఆశ్చర్యం లేదని అన్నారు.
పకియావ్ గెలిచి ఉండాల్సిందని తన అభిప్రాయాన్ని తెలిపారు. మేవెదర్ను మొదటి నుంచి తన పంచ్లతో ఇబ్బందికి గురి చేశాడని, ఫిలిప్పీన్స్ జాతీయులను అతడు నిరాశపర్చలేదని కితాబిచ్చాడు. ఇక ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బెనిగ్నో అక్వినో మాట్లాడుతూ పకియావ్ దేశ వాసులకు స్ఫూర్తిగా నిలిచాడని పేర్కొన్నారు.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ పోరులో ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా) ఛాంపియన్గా నిలిచాడు. బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన గేమ్లో ప్రత్యర్ధి పకియావ్ (ఫిలిప్పీన్స్)ను ఓడించి విజేతగా నిలిచాడు. ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఏకగ్రీవంగా మేవెదర్ను విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
బౌట్ అనంతరం పకియావ్ మాట్లాడుతూ ప్లాయిడ్ మేవెదర్ను తాను పలు మార్లు తన పంచ్లతో ఠారెత్తించానని, అతడిపై మొదటి నుంచి ఆధిపత్యం చెలాయించానని అన్నారు. 12 రౌండ్ల పాటు జరిగిన ఈ బౌట్ ముగిసిన అనంతరం ముగ్గురు న్యాయనిర్ణేతలు మేవెదర్ను విజేతగా ప్రకటించడంపై పకియావ్ విస్మయం చెందాడు.