పిచ్చి ముదిరింది: తాత శవంతో సెల్ఫీ దిగాడు
లండన్: సెల్ఫీల పిచ్చి యువతలో వింత దోరణులకు దారితీస్తోంది. సెల్ఫీల పిచ్చితో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు తమ పిచ్చితో ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల తాత మరణించడంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో ఉంటే.. మనవడైన ఓ యువకుడు ఆ తాత శవంతో సెల్పీ దిగాడు. అంతేగాక, ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
ఈ ఘటన దుబాయ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాకు చెందిన ఓ యువకుడు మరణించిన తాత పక్కన సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మంచంపై తాత మృతదేహం పక్కన విచిత్రమైన హావభావాలతో మొహం పెట్టి, నాలుకను బయటకు చాచి సెల్ఫీ దిగాడు.
ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పక్కన 'గుడ్ బై గ్రాండ్ ఫాదర్' అంటూ రాసుకున్నాడు. చావుకు, శుభాలకు తేడా తెలియని ఈ ఫొటో చూసి నెటిజెన్లు షాక్ అయ్యారు. కుర్రాడి ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక ఫిర్యాదులు రావడంతో ఈ సంఘటనపై సౌదీ అధికారులు విచారణకు ఆదేశించారు.
సెల్ఫీ దిగిన కుర్రాడిది కనీస బాధ్యతలేని చర్య అని, నైతిక విలువలను ఉల్లంఘించడమేనని మదీన ప్రాంత మీడియా, ప్రజాసంబంధాల అధికారి అబ్దుల్ రజాక్ అన్నారు. ఈ ఘటన నేరమని, ఆ కుర్రాడిని శిక్షించాలని సౌద్ అల్ హర్బీ అనే న్యాయవాది అన్నారు. ఇలాంటి చర్యలను ఇతరులు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.