పాక్ పదో తరగతి పరీక్షల్లో సిక్కు బాలికకు ఫస్ట్ ర్యాంక్
లాహోర్: పాకిస్తాన్లో పదో తరగతి పరీక్షలలో పాక్కు చెందిన ఒక సిక్కు బాలిక మొదటి ర్యాంక్ను సాధించింది. సెకండరీ పాఠశాల పరీక్షలలో పదిహేనేళ్ల మన్ బీర్ కౌర్ అనే అమ్మాయికి 1,100 మార్కులకు గాను 1,035 మార్కులు వచ్చాయి.
వెయ్యికి పైగా మార్కులు సాధించిన సిక్కు బాలికగా ప్రత్యేకత సాధించింది. ఇంతమంచి మార్కులు సాధించిన తొలి సిక్కు బాలికగా మన్ బీర్ కౌర్ ప్రత్యేకతను చాటుకుందని పంజాబ్ అసెంబ్లీ సభ్యుడు మేరీ గిల్ ప్రశంసించారు.
మన్ బీర్ కౌర్... గియానీ ప్రేమ్ సింగ్ కూతురు. అతను గురుద్వారా శ్రీ నాన్ కానా సాహిబ్లో హెడ్ గ్రాంథిగా పని చేస్తున్నారు. పాకిస్తాన్ జనాభాలో సిక్కులు కేవలం ఒక శాతం వరకు మాత్రమే ఉంటారు.
మన్ బీర్ కౌర్ చేసిన హార్డ్ వర్క్ వల్లే ఆమె మొదటి ర్యాంక్ సాధించిందని, ఆమె చదువుల్లో ఎప్పుడు ముందుంటుందని తండ్రి గర్వంగా చెప్పారు. తన కూతురు లాహోర్లోని పంజాబ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలో ప్రీ మెడికల్ కోర్సులో చేరుతుందని చెప్పారు. ఆమె డాక్టర్ కావాలనుకుంటోందన్నారు.