కుమారుడి హత్య: తల్లికి 18 సంవత్సరాలు జైలు శిక్ష
న్యూయార్క్: అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని హత్య చేసిన కేసులో తల్లికి న్యూయార్క్ కోర్టు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. గిగి జోర్డాన్ (54) అనే మహిళకు జైలు శిక్ష పడింది. ఈమె తన 8 సంవత్సరాల కుమారుడిని హత్య చేసినట్లు కోర్టులో అంగీకరించింది.
యోగా టీచర్ ఎమిల్ జెకొవ్, గిగి జోర్డాన్ దంపతులు. వీరికి జూడ్ మిర్రా (8) అనే కుమారుడు ఉన్నాడు. మిర్రా మతిస్థిమితం లేకుండ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జెకొవ్ కుమారుడిని లైంగికంగా వేధించి చిత్రహింసలు పెట్టేవాడు.
మిర్రా ఈ విషయం తన తల్లి కి చెప్పాడు. భర్త వేధింపుల నుండి కుమారుడు మిర్రాకు విముక్తి కలగాలంటే హత్య చెయ్యాలని గిగి నిర్ణయించింది. 2010వ సంవత్సరం మన్ హట్టన్ లోని ఒక ఖరీదైన హోటల్ లో గిగి తన కుమారుడు మిర్రాకు సిరంజి ద్వార మందులు ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేసింది.
ఈ కేసులో పోలీసులు గిగిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. భర్త వేదింపుల నుండి కుమారుడికి విముక్తి కలిగించాలని గిగి హత్య చేసిందని ఆమె న్యాయవాది కోర్టులో వాదించారు. మానవత్వంతో హత్య చేసినందు వలన కేసు కొట్టి వేయాలని మనవి చేశారు.
అయితే ప్రాసిక్యూటర్లు మాత్రం ఆనారోగ్యంతో ఉన్న కుమారుడిని పెంచుకోలేక హత్య చేశారని వాదించారు. అందు వలన 25 సంవత్సరాల పడవలసిన జైలు శిక్షను 18 సంవత్సరాలకు తగ్గించామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. గిగి పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈమె ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.