మూడ్రోజులు ఆస్ట్రేలియన్ పొట్టలో బతికున్న సాలెపురుగు
సిడ్నీ: ఒక ఆస్ట్రేలియన్ యువకుడి పొట్టలోకి సాలెపురుగు వెళ్లి అతనిని మూడు రోజుల పాటు నరకయాతనకు గురి చేసింది. మూడు రోజుల పాటు అతని పొట్టలోనే సజీవంగా ఉన్న సాలెపురుగును శుక్రవారం వైద్యులు బయటకు తీశారు. మాక్స్వెల్ మీడియాతో చెప్పిన వివరాల ప్రకారం...
డ్యాలన్ థామస్ అనే యువకుడు సెలవులకని ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లాడు. అక్కడ ఒక ఊష్ణ మండల సాలెపురుగు అతని శరీరం మీద సన్నని రంద్రం చేసుకొని పొట్టలోకి ప్రవేశించింది. మూడు రోజులుగా అది అతని శరీరం లోపలే బతికి ఉంది.
అతనిని నరకయాతన పెట్టింది. దీనిని వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ ద్వారా వైద్యులు దానిని బయటకు తీశారు. తన శరీరంలో సాలెపురుగు ఉన్నన్ని రోజులు తీవ్ర నరకయాతన అనుభవించానని డ్యాలన్ థామస్ చెప్పారు.
దెబ్బతిన్న కణాలతోనే గుండెపోటుకు చెక్
మనిషి గుండెలో దెబ్బతిన్న కణాలను రక్తనాళాలుగా మార్చే సరికొత్త పద్ధతిని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని సాయంతో దెబ్బతిన్న హృదయ భాగాలను కోలుకొనేలా చేసి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు.
గుండెలో చిన్న చిన్న మచ్చలుగా ఏర ్పడి హృదయం పనితీరును ప్రభావితం చేసే ఫైబ్రోబ్లాస్ట్స్ అనే ఈ కణాలు దెబ్బతిన్న గుండెలోని రక్తనాళాలుగా పరివర్తన చెందగలవని ఈ పరిశోధనలో తేలింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసే ఒక సరికొత్త ఔషఽధాన్ని కూడా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది.
మూర్ఛ రోగులకు శస్త్రచికిత్స చేసే రోబో
మూర్ఛ రోగులకు చేసే శస్త్రచికిత్సను ప్రమాదరహితంగా మార్చేక్రమంలో శాస్త్రవేత్తలు ఓ రోబోను తయారు చేశారు. ప్రస్తుతం మూర్ఛ వ్యాధికి కారణమయ్యే మెదడులోని భాగాన్ని గుర్తించి, తర్వాత కపాలాన్ని కొంతమేర ఛేదించి శస్త్రచికిత్సను నిర్వహిస్తున్నారు.
ఈ చికిత్స చాలా ప్రమాదకరమైనదని, శస్త్రచికిత్స సమయంలో, ఆ తర్వాతా రోగి పలు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆపరేషన్ కోసం చేసిన గాయం మానేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఇబ్బందులకు తావివ్వని రీతిలో శస్త్రచికిత్స చేసేలా రోబోను అభివృద్ధి చేశామని వాండెర్బిల్ట్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.