లంక వర్షాలు: 20 మంది మృతి, 300 మంది గల్లంతు
న్యూఢిల్లీ శ్రీలంకలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 300 మంది గల్లంతయ్యారని శ్రీలంక డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్(డీఎమ్సీ) బుధవారం తెలిపింది. శ్రీలంకలోని దక్షిణ, తూర్పు తీరంలో ఉన్న హల్దాముల్లా జిల్లాలో బుధవారం తేయాకు తోటల వద్ద భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో అక్కడ నివాసం ఉన్న 150 కుటుంబాలకు చెందిన కార్మికులు చాలా మంది బురదలో కూరుకపోయారు.
డీఎమ్సీ అధికార ప్రతినిధి శరత్ లాల్ కుమారు మాట్లాడుతూ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. బుధవారం మధ్యాహ్నాం నాటికి 20 మంది మృతదేహాలను వెలికి తీశామని అన్నారు. దీనికి కారణం శ్రీలంకలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలేనని అన్నారు.
ఈ ప్రాంతంలో మరింతగా కొండ చరియలు విరిగిపడతాయనే సంకేతాలను అక్కడి ప్రజలకు చేరవేశామని అన్నారు. సెక్యూరటీ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ (సెంట్రల్) కమాండర్ మేజర్ జనరల్ మనో ఫెరారా మాట్లాడుతూ ఈ సహాయ కార్యక్రమాల్లో త్రవిధ దళాలకు చెందిన సెక్యూరిటీ ఫోర్సెస్ పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
మొత్తం 500 మంది మట్టిలో కూరుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తేయాకు తోటల వద్ద నివాసం ఉంటున్న 150 కుటుంబాలకు చెందినవారి ఆచూకీ తెలియడం లేదు. వీరిలో ఎక్కువ మంది మృతి చెంది ఉంటారనే అనుకుంటున్నారు.
శ్రీలంక ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి జినాన్ సెనివిర్నా మాట్లాడుతూ బెల్ 212 హెలికాప్టర్స్ కూడా సహాయ కార్యక్రమాల్లోపాల్గొంటున్నాయని చెప్పారు.