శ్రీలంక అధ్యక్షుడి తమ్ముడు ప్రియాంత దారుణ హత్య
శ్రీలంక: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన సోదరుడు ప్రియాంత శిరిసేన అలియాస్ వేలి రాజు (42) దారుణ హత్యకు గురైనాడు. ప్రియాంత శిరిసేనను ఆయన స్నేహితుడే హత్య చేశాడని పోలీసు అధికారి రువాన్ జ్ఞానశేఖర్ అంటున్నారు. అనుమానితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కోలంబో పోలీసు అధికారులు తెలిపారు.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన చివరి తమ్ముడు ప్రియాత శిరిసేన. శ్రీలంక రాజధాని కోలంబోకు 215 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలోన్నారువ అనే నగరంలో ప్రియాంత శిరిసేన నివాసం ఉంటున్నారు. అదే ఆయన సొంత ప్రాంతం.
ప్రియాంత శిరిసేన వ్యాపారవేత్త. గురువారం రాత్రి ప్రియాంత వ్యాపార నిమిత్తం సొంత నగరం అయిన పాలోన్నారువలో పర్యటించారు. తరువాత కారు దిగి వెళుతున్న సమయంలో ఒకతను గొడ్డలి తీసుకుని వచ్చి ప్రియాంత మీద దాడి చేశాడు. ఆయన తలకు తీవ్రగాయాలైనాయి.
వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి తరువాత అదే రోజు రాత్రి ప్రియాంతను కోలంబోకు తరలించారు. కోలంబోలోని ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతూ ప్రియాంత శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తలకు తీవ్రగాయాలు అయ్యాయని, మెరుగైన చికిత్స చేసినా ప్రియాంత కొలుకోలేదని వైద్యులు అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల శిరిసేన చైనా పర్యటనలో ఉన్నారు. శనివారం ఆయన శ్రీలంక చేరుకుంటారు. తరువాత ప్రియాంత అంత్యక్రియలు జరుగుతాయని పోలీసు అధికారి రువాన్ జ్ఞానశేఖర్ తెలిపారు.