ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ వచ్చే ప్రమాదముందా?
సోమవారం రాత్రి ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై ఈ భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. దీనికంటే ముందు జమ్మూకశ్మీర్లోని కొండ ప్రాంతమైన దోడా జిల్లా బదెర్వాలో కూడా భూకంపం సంభవించింది.
ఇండోనేషియా: ఇండోనేషియాలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 9.35 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది.
పాలు ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలోని సులావేసిలో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. దాదాపు 2 లక్షల మంది ప్రజానీకం ఈ భారీ భూకంపం ప్రభావానికి గురై ఉంటారని అంచనా.
అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లుగా అధికారిక సమాచారం అందలేదు. భయపడాల్సిన అవసరం లేదని, సునామీ సంభవించే ప్రమాదం లేదని ఇండోనేషియన్ ఏజెన్సీ ఫర్ మెటరాలజీ, క్లైమెటాలజీ మరియు జియో ఫిజిక్స్ సంస్థ అధికారులు పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లో కూడా...
జమ్మూకశ్మీర్లోని కొండ ప్రాంతమైన దోడా జిల్లా బదెర్వాలో కూడా సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రతను జమ్మూ వర్శిటీ బదెర్వా క్యాంపస్లోని భూప్రకంపనల నమోదు కేంద్రం 4.7గా నమోదు చేసింది.
రాత్రి 7.23 గంటలకు భూమి కంపించడంతో ఉదయం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలో ఉండి దీక్ష విరమించేందుకు సిద్ధమవుతున్న ముస్లిం సోదరులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు ఇంతవరకూ సమాచారం లేదు.