మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చి చంపాడు
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. విలియం స్టోన్ అనే సాయుధుడు తన మాజీ భార్య సహా ఆమె కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నిందితుడు దాగి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోవాలని పోలీసులు నిందితుడిని హెచ్చరించారు.
అయితే, విలియం స్టోన్ పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పెన్సిల్వేనియాలో ఈ కాల్పుల సంఘటన కలకలం రేపింది. కాల్పులకు పాల్పడిన 35 ఏళ్ల బ్రాడ్లీ విలియమ్ స్టోన్ పెన్సిల్వేనియాలోని పెన్స్బర్గ్ చుట్టుపక్కల ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
తాళాలు వేసుకుని ఇంట్లోనే ఉండాలని, బయటకు రావద్దని మోంట్గోమరీ కౌంటీ జిల్లా అటార్నీ ప్రజలకు సూచించారు. విలియమ్ స్టోన్ మాజీ భార్యతో పాటు ఆమె అమ్మమ్మను, అమ్మను, ఆమె సోదరిని, మరో ఇద్దరిని కాల్చి చంపినట్లు చెబుతున్నారు.
విలియమ్ స్టోన్ జాడ తెలియడం లేదు. తన ఇద్దరు కూతుళ్లను అతను తన మాజీ భార్య ఇంటికి తీసుకుని వెళ్లాడు. వారని పక్కింట్లో వదిలేశాడు. వారు క్షేమంగానే ఉన్నారు. స్టోన్ తరుచుగా కర్రను లేదా వాకర్ వాడుతాడని, అయితే అది అతనికి అవసరమా లేదా అనే విషయంపై స్పష్టత లేదని అంటున్నారు.