మరుగుజ్జు మనుషులు.. నిజమేనా? అవునంటున్న శాస్త్రవేత్తలు!
మనకంటే పూర్వం ఈ భూమ్మీద మరుగుజ్జు మనుషులు నివసించే వారా? అన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు అవుననే సమాధానమిస్తున్నారు.
లిల్లీపుట్స్ అంటే మరుగుజ్జు మనుషులు. సింద్ బాద్ సాహసయాత్రలు వంటి జానపద కథల్లో వీరి ప్రస్తావన ఉంటుంది. 'నైట్ ఎట్ ద మ్యూజియం' సిరీస్ సినిమాల్లో కూడా ఈ మరుగుజ్జు క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అయితే ఈ మరుగుజ్జు మనుషులు నిజంగా ఉన్నారా? అంటే.. 'అవును' అనే సమాధానం వినవస్తోంది.
మనకంటే పూర్వం ఈ భూమ్మీద మరుగుజ్జు మనుషులు నివసించే వారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన రుజువులు కూడా అక్కడక్కడా లభ్యమవుతున్నాయి. దీంతో మరుగజ్జు మనుషులు కేవలం కల్పితమే కాదని అర్థమవుతోంది.
చరిత్రలోకి తొంగిచూస్తే...
1992లో శాన్ పెడ్రో పర్వతాల్లో సెసిల్ మన్, ఫ్రాంక్ కర్ అనే ఇద్దరు వ్యక్తులు బంగారపు గనుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. అంతలోనే ఏదో లోహం తగిలిన శబ్డం వినవచ్చింది. దీంతో ఇద్దరి కళ్లూ ఆనందంతో మెరిశాయి.
ఎన్నో ఏళ్ల తమ కల ఫలించిందనే ఉత్సాహంతో మరింత వేగంగా తవ్వారు. కాసేపటికి ఓ ఆరున్నర అంగుళాల లోహపు పెట్టె బయటపడింది. దాన్ని తెరిచి చూడగానే షాక్. అందులో ఓ మరుగుజ్జు మమ్మీ ఉంది. దాన్ని బయటికి తీసి నిలబెడితే 14 అంగుళాల పొడవుంది.
అది అతి విలువైన మమ్మీగా భావించిన వారిరువురూ దానిని కొన్న సంవత్సరాల తరువాత ఓ కార్ల వ్యాపారికి విక్రయించారు. అతడు ఆ మమ్మీని కొంతకాలంపాటు ప్రదర్శనకు ఉంచి కొంత డబ్బు సంపాదించుకున్న తరువాత మరో వ్యాపారికి అమ్మేశాడు.
ఆ వ్యాపారి దాన్ని ఓ శాస్త్రవేత్త వద్దకు తీసుకెళ్లి ఎక్స్ రే పరీక్ష చేయించగా.. అది ఓ 65 ఏళ్ల వృద్ధుడి మమ్మీ అని తెలిసింది. ఎక్స్ రేలో మానవ అస్థిపంజరం స్పష్టంగా కనిపించడంతో ఆశ్చర్యానికి లోనైన ఆ శాస్త్రవేత్త ఈ భూమిపై పూర్వం మరుగుజ్జు మనుషులు కూడా జీవించారని ధ్రువీకరించాడు. ఆ మరుగుజ్జు మనిషి మమ్మీని పరిశోధన కోసం 1950 లో మరో శాస్త్రవేత్త తీసుకున్నాడు. ఆ తరువాత అదేమైందో ఎవరికీ తెలియదు. ఇది చరిత్ర.
అసలెవరు వీళ్లు?
ఉత్తర అమెరికా ప్రాచీన జానపద సాహిత్యంలో కూడా ఈ మరుగుజ్జు మనుషుల గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. వీళ్లు నిమరిగర్ అనే తెగకు చెందిన వారని, ఆయుధాలుగా విల్లంబులు ఉపయోగించేవారు.
వయివోమింగ్ లోని విండ్ నది, పెడ్రో కొండల్లో వీళ్లు నివసిస్తారని అందులో ఉంది. బాణాలకు విషం పూసి స్థానిక ప్రజలపై దాడులు చేసేవారని జానపద సాహిత్యం ద్వారా తెలుస్తోంది. వీళ్లను స్థానికులు బూచోళ్లు అని, రాక్షసులని, భూతాలని కూడా పిలిచేవారట.
మన దగ్గరా ఉండేవారా?
తిరుపతి శేషాచలం అడవుల్లో బూచోళ్ల పేట అనే ఓ ప్రాంతం ఉంది. ఇక్కడ కూడా కేవలం కొన్ని అంగుళాల పొడవు ఉన్న మనుషులు ఉండేవారని స్థానికులు పేర్కొంటారు. వాళ్లను స్థానికులు బూచోళ్లు అని పిలుస్తుంటారు. ఈ బూచోళ్లు తమ బాణాలను పదును చేసుకున్న ఆనవాళ్లు ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నాయని కొందరు చెబుతుంటారు.