విహారయాత్రలో విషాదం: బ్రేకులు ఫెయిలయి.. విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని..
విహారయాత్రకు బయలేదేరిన ఓ కాలేజీ బస్సు అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ తోపాటు 13 మంది విద్యార్థులు మరణించారు.
మనీలా: ఫిలిప్పీన్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు బయలేదేరిన ఓ కాలేజీ బస్సు అదుపుతప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ తోపాటు 13 మంది విద్యార్థులు మరణించగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మనీలాకు తూర్పు దిశగా ఉన్న రిజ్వాల్ రాష్ట్రంలోని తనయ్యా పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో మనీలాకు చెందిన బెస్ట్ లింక్ కాలేజీ విద్యార్థులు రీసెర్చ్ ఫీల్డ్ ట్రిప్ కోసం మొత్తం 9 బస్సుల్లో బయలుదేరి వెళుతుండగా ఒక్క బస్సు ప్రమాదానికి గురైంది.
డౌన్ హిల్ రోడ్డులోకి వచ్చేసరికి బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను మెరుగైన చికిత్స నిమిత్తం అమాంగ్ రోడ్రిగ్స్ మెడికల్ సెంటర్ కు తరలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 50 మంది వరకు విద్యార్తులు ఉన్నారు. బస్సు కూడా అమితమైన వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బస్సు రూఫ్ టాప్ పూర్తిగా బస్సునుంచి విడిపోయి ఒక పక్కన పడిపోయింది. సీట్లు కూడా ఎక్కడికక్కడ విరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు.