కలవరం: భూమి పైకి దూసుకొస్తున్న గ్రహశకలం! తాకితే ప్రళయమే!
భూమి పైకి దూసుకొస్తున్న తాజా గ్రహశకలం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దాదాపు 4.4 కిమీల విస్తీర్ణం కలిగిన ఈ గ్రహశకలం కనుక భూమిని తాకితే ప్రళయం తప్పదని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు.
వాషింగ్టన్: భూమి పైకి దూసుకొస్తున్న తాజా గ్రహశకలం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దాదాపు 4.4 కిమీల విస్తీర్ణం కలిగిన ఈ గ్రహశకలం కనుక భూమిని తాకితే ప్రళయం తప్పదని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు.
నాసా శాస్త్రవేత్తలు దీన్ని దాదాపు 20 ఏళ్ల కిందటే కనుగొన్నారు. ఈ గ్రహశకలం పేరు ఆస్టరాయిడ్ ఫ్లోరెన్స్. ఇప్పటి వరకు భూమికి దగ్గరగా వచ్చిన గ్రహ శకలాల వల్ల ప్రమాదాలేవీ చోటు చేసుకోలేదు. అయితే, తాజా గ్రహశకలం పరిమాణంలో పెద్దదిగా ఉండటంతో ఆందోళన నెలకొంది.
ఇది ఈ నెలాఖరు నుంచి క్రమేణా భూమికి దగ్గరవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమికి ఏడు మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి దాటుకుని వెళుతుందని, సెప్టెంబరు 1న ఇది వేగంగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2013లో కూడా ఇలాగే 20 మీటర్ల పరిమాణం కలిగిన ఓ గ్రహశకలంతో విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు భావించారు.
వారి అంచనా ప్రకారం.. గ్రహశకలం పరిమాణం ఒక కిలోమీటరు దాటితే ప్రమాద స్థాయి తీవ్రంగా ఉంటుంది. నాసా ఇప్పటి వరకు 880 గ్రహశకలాలు భూమికి సమీపంలో ఉన్నట్లు గుర్తించింది. ఇటువంటి పరిణామం మళ్లీ 2500లో సంభవిస్తుందని పేర్కొన్నారు. గతంలో 1890లో ఇటువంటి గ్రహ శకలమే భూమికి అతి సమీపంగా వచ్చిందని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడు రానుందని చెప్పారు.
ఈ గ్రహ శకల ప్రయాణం వివిధ నక్షత్ర మండలాల గుండా ఉంటుందని, దాన్ని టెలిస్కోపు ద్వారా గమనించవచ్చని వివరించారు. అయితే మరో 500 ఏళ్ల వరకు భూమికి ఎలాంటి ప్రమాదం లేదని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నా, తాజా గ్రహశకలం స్థితిపై మాత్రం సరైన అంచనాకు రావటం లేదు. ఆగస్టు నెలాఖరు నుంచి ఈ గ్రహశకలాన్ని టెలిస్కోప్ ద్వారా చూడవచ్చుని చెబుతున్నారు.