ముందు కొనేసి, ఆపైన లబోదిబో: ఎవరైనా చెట్టును కొంటారా? అదీ రూ.1.62 కోట్లకు?
రూ.2 వేలు కూడా ఖరీదు చేయని ఓ సాధారణ చెట్టును... మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి చేత రూ.1.62 కోట్లకు కొనిపించేశాడు ఓ ఘరానా మోసగాడు.
బీజింగ్: ఎంత తెలివైన వాడైనా ఒక్కోసారి చాలా సులువుగా మోసగాళ్ల వలలో చిక్కుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం. మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు, సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నా కొందరు వాళ్ల బుట్టలో పడిపోతూనే ఉంటారు.
ఓ సాధారణ చెట్టును... మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి చేత రూ.1.62 కోట్లకు కొనిపించేశాడు ఓ మోసగాడు. తీరా కొన్న తరువాత తాను మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యక్తి లబోదిబో మంటూ పోలీసుల వద్దకు పరిగెత్తిన వైనమిది.
చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన లిన్ అనే వ్యక్తి 29 డాలర్ల ఖరీదు చేసే చెట్టును కొన్నాడు. దాన్ని అరుదుగా లభించే.. ఫోయిబె జెన్నన్ జాతి చెట్టు అని.. కేవలం సిచువాన్, హ్యూబి, గుజావు ప్రాంతాల్లో మాత్రమే పెరిగే చెట్టు అంటూ మాయమాటలు చెప్పి కొనుగోలుదారులను ఆకర్షించాడు.
ఆ చెట్టుకు పెద్ద చరిత్ర ఉందని.. చాలా విలువైనదని చెప్పకొచ్చాడు. ఒకప్పుడు రాజులు కేవలం ఈ చెట్టు కలపతోనే గృహోపకరణాలు తయారు చేయించుకునేవారని ప్రచారం చేశాడు. అంతేకాదు.. అది జెన్నన్ జాతి చెట్టుగా నకిలీ ధ్రువపత్రాలు కూడా సృష్టించాడు.
లిన్ మాటలు నమ్మిన ఓ వ్యక్తి 2,44,000 డాలర్లు ( సుమారు రూ.1.63 కోట్లు ) వెచ్చించి ఆ చెట్టును కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆ చెట్టును నిపుణులతో పరీక్షలు చేయించగా అది జెన్నన్ జాతీ చెట్టు కాదని, దాని ఖరీదు రూ.2 వేలు కూడా ఉండదని వారు తేల్చేశారు. దీంతో కొన్న వ్యక్తి గుండె జారిపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చెట్టు అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.