చైనాకు షాక్ ఇచ్చిన ట్రంప్.. మండిపడిన డ్రాగన్, తేల్చుకుంటామంటూ వార్నింగ్
అమెరికా, చైనా నడుమ ప్రచ్ఛన్న వాణిజ్య యుద్ధం రాజుకుంది. చైనా అక్రమ వాణిజ్య పద్ధతులు, మేధో హక్కుల చౌర్యం వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తునకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
వాషింగ్టన్: అమెరికా, చైనా నడుమ ప్రచ్ఛన్న వాణిజ్య యుద్ధం రాజుకుంది. చైనా తన దగాకోరు వాణిజ్య విధానాలతో అమెరికాను నిలువు దోపిడీ చేస్తోందని, మేధో సంపత్తి హక్కుల చౌర్యంతో లక్షల కోట్ల డాలర్ల మేర తమను ముంచేస్తోందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదు, చైనా అక్రమ వాణిజ్య పద్ధతులు, మేధో హక్కుల చౌర్యం వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తునకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జర్ స్పందించి దర్యాప్తు ప్రారంభించారు.
ట్రంప్ బాటలో భారత్, చైనా ఎలక్ట్రానిక్స్ కు చెక్! అసలెన్ని? కేంద్రం ఆరా, భద్రతకూ సవాలే!
అమెరికా తాజా చర్యతో చైనా తీవ్రంగా మండిపడింది. తాము కూడా చేతులు ముడుచుకుని కూర్చోమని హెచ్చరించింది. నిజానికి అమెరికా, చైనా మధ్య ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు రగులుకుని ఉన్నాయి. మరోవైపు చైనాకు ప్రియ మిత్రుడైన ఉత్తరకొరియా కూడా అమెరికాకు చికాకు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది.
చైనా వల్ల లక్షల ఉద్యోగాలు గల్లంతు
చైనా వ్యవహారాల కారణంగా అమెరికాలో ఏటా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు గల్లంతు అవుతున్నాయట. మేధో హక్కులను దొంగిలిస్తున్న కారణంగా అమెరికా లక్షల కోట్ల డాలర్లు నష్టపోతోందట. ఈ ఆరోపణలు స్వయంగా అమెరికా అధ్యక్షుడే చేశారు. చైనా వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించడాన్ని కూడా ట్రంప్ గట్టిగా సమర్థించుకున్నారు. ఏళ్లుగా ఈ దారుణం జరుగుతున్నా, గత ప్రభుత్వాలు ఏలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. అందుకే.. ఈ మేధో హక్కుల చౌర్యం, అమెరికా టెక్నాలజీని బలవంతంగా బదిలీ చేయించుకోవడంలో చైనా వినియోగిస్తున్న విధానాలు, పద్ధతులపై సమగ్రవిచారణ జరపాలని తాను ట్రేడ్ రిప్రెజంటేటివ్ను ఆదేశించినట్టుగా ట్రంప్ తెలిపారు.
మేమూ చూస్తూ ఊరుకోం...
ట్రంప్ నిర్ణయంపై చైనా కూడా తీవ్రంగానే స్పందించింది. అమెరికా తీసుకునే చర్యల వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం దెబ్బతినే పక్షంలో తాము చూస్తూ కూర్చోమని హెచ్చరించింది. తమ ప్రయోజనాలను తాము రక్షించుకుంటామని స్పష్టం చేసింది. మేధో హక్కుల విషయంలో తాము అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలకు కట్టుబడే వ్యవహరిస్తున్నామని తెలిపింది.
ఉపేక్షించే సమస్యే లేదు...
తమ మార్కెట్ లోకి ప్రవేశించాలంటే అమెరికా కంపెనీలు వాటి అమూల్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాల్సిందేనంటూ అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా బలవంతం చేసే దేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ట్రంప్ హెచ్చరించారు. చైనా అవలంభిస్తున్న అక్రమ వ్యాపార పద్ధతులు, దుష్టచర్యల వల్ల నష్టపోకుండా అమెరికా ఉద్యోగులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని , పారిశ్రామిక రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా తనపై ఉందని ఆయన పేర్కొన్నారు.
చైనా దెబ్బకు.. అమెరికా ఢమాల్?
అమెరికా ఆర్థిక రంగాన్ని చైనా తన ఎగుమతులతో కొన్నేళ్లుగా ముంచెత్తుతోంది. చైనా దెబ్బకు అమెరికాలో ఉత్పత్తుల రంగం పూర్తిగా కుంటుబడింది. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక్క 2016లోనే అమెరికా 35,000 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసిందట. అయితే ట్రంప్ నిర్ణయం వల్ల.. అమెరికా, చైనా ద్వైపాక్షిక వాణిజ్యానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ ఉండదని నిపుణులు చెబుుతున్నారు. ముందుగా చైనా అక్రమ వాణిజ్య విధానాలు అనుసరిస్తోందనే విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారించాల్సి ఉంటుందని, ఆ తరువాతే దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
అప్పుల కుప్ప.. చైనా?
చైనా చాలాకాలంగా అదేపనిగా అప్పులు చేసి మౌలిక ప్రాజెక్టులు, రియల్టీ రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అప్పుల భారం ప్రమాదకర స్థాయికి చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరోసారి హెచ్చరించింది. నిర్మాణాత్మక సంస్కరణలతో దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఆ దేశ జిడిపి వృద్ధి రేటు భారీగా పడిపోవడంతో పాటు పుట్టి మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే జరిగితే చైనాకు తీవ్ర ఆటుపోట్లూ తప్పవని స్పష్టం చేసింది. అప్పుల మీద అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను నడిపించాలనుకుంటే గత ఏడాది జిడిపిలో 235 శాతంగా ఉన్న అప్పుల భారం, 2022 నాటికి 290 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది.