భారతీయ-అమెరికన్ జడ్జికి.. ఉన్నత పదవినిచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ భారతీయ-అమెరికన్ జడ్జిని శక్తిమంతమైన అపీల్స్ కోర్టులో కీలక పదవిలో నియమించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈమధ్యన భారతీయులపై తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. మంగళవారం భారతీయ-అమెరికన్ జడ్జి అమూల్ థాపర్ (47)ను శక్తిమంతమైన అపీల్స్ కోర్టులో కీలక పదవిలో నియమించారు.
ఇటువంటి ఉన్నత స్థాయి జ్యుడిషియల్ పోస్ట్కు ట్రంప్ నియమించిన తొలి భారతీయ-అమెరికన్ అమూల్ కావడం విశేషం. ట్రంప్ నియామకాన్ని సెనేట్ ధ్రువీకరిస్తే.. అమూల్ శక్తిమంతమైన అమెరికా 6వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్లో భాగస్వామి అవుతారు.
కెంటకీ, టెన్నెసీ, ఓహియో, మిచిగాన్ రాష్ట్రాల నుంచి వచ్చే అపీళ్ళను ఈ కోర్టు విచారిస్తుంది. ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో 20 మంది జడ్జిల పేర్లతో సుప్రీంకోర్టు నామినీల జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో కూడా అమూల్ థాపర్ పేరు ఉంది.
అమూల్ థాపర్ నియామకంపై ట్రంప్ నిర్ణయాన్ని సెనేట్ మెజారిటీ నేత మిచ్ మెక్కోనెల్ స్వాగతించారు. అమూల్ తన కెరీర్లో అద్భుతమైన మేధో సంపత్తిని, చట్టం పట్ల చెదరని అంకితభావాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు. అమూల్ తన కొలీగ్స్ నుంచి గౌరవాన్ని పొందారన్నారు.
డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయన ప్రదర్శించిన తెలివితేటలు, న్యాయ దృక్పథం, సామర్థ్యంతో 6వ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అపీల్స్కు వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ మంచి నిర్ణయం తీసుకున్నారని, సెనేట్ ధ్రువీకరణ కోసం చూస్తున్నానని తెలిపారు.