భారత మధ్యతరగతిపై ట్రంప్ దెబ్బ: ఏలిన వారికీ సవాలే
ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు లభిస్తున్న ఉద్యోగావకాశాలు మున్ముందు తగ్గిపోతాయని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
న్యూఢిల్లీ: స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో హెచ్ 1 బీ వీసా రద్దు చేసింది అమెరికా. ఆస్ట్రేలియా కూడా 457 క్యాటగిరీ వీసాల జారీని రద్ధుచేసింది. అదే బాటలో బ్రిటన్, న్యూజిలాండ్ తదితర దేశాలు పయనిస్తున్నాయి. ఈ పరిణామాలు భారత్కు ప్రత్యేకించి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూసే మధ్య తరగతి వర్గానికి గట్టి ఎదురుదెబ్బేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
1991 తర్వాత సంపన్న దేశాలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పదేపదే చెప్తూ వచ్చిన 'ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్)' విగత జీవిగా మారిపోయిందన్న వాస్తవాన్ని మనం అందునా మధ్యతరగతి వర్గం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు లభిస్తున్న ఉద్యోగావకాశాలు మున్ముందు తగ్గిపోతాయని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. చరిత్ర నుంచి ప్రత్యేకించి గతం అందించిన చేదు గుళికల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం ప్రతి ఒక్కరికీ తప్పదు.
విదేశాల్లో ఉపాధి అవకాశాలు కొడిగట్టిపోతున్న తరుణంలో మధ్య తరగతి భారతీయులు తమ కుటుంబ ప్రగతి కోసం మరో నూతన అధ్యయాన్ని పున:లిఖించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. భారత్లో ఉన్నత విద్యావకాశాలు చాలా మ్రుగ్యం అని, ప్రైవేట్ రంగంలో ఉపాధికి అవసరమైన నైపుణ్యాన్నిచ్చే స్థాయిలో విద్యారంగంలో అంతరాయం నెలకొన్నదన్న విషయం బహిరంగ రహస్యమే.
తలకు మించిన భారం కానున్న విద్యాభ్యాసం
ఇటీవల పంజాబ్ విశ్వవిద్యాలయం అడ్మిషన్ ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయం విద్యాభ్యాసం మరింత వ్యయభరితం కానున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యాభ్యాసానికి అవసరమైన రుణాలు తీర్చుకోవాలంటే ప్రవేట్ రంగంలో ఉపాధి అవకాశాల లేమి వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, అధికార పార్టీకి సవాల్గా పరిణమిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్కెట్ ఆధారిత ఉపాధిపై కేంద్రీకరణ
యావత్ ప్రపంచ దేశాలకు ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థగా దిశా నిర్దేశం చేస్తూ వచ్చిన ‘సోవియట్ యూనియన్' 1991 శీతాకాలంలో ప్రపంచ చిత్రపటం నుంచి అంతర్దానం అయ్యాక భారత మద్య తరగతి కుటుంబాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పటివరకు దేశంలో అమలులో చేసిన మిశ్రమ ఆర్థిక విధానాలతో ప్రభుత్వోద్యోగాల కల్పన, ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు.. మధ్య తరగతి భారతీయులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయి. కానీ సోవియట్ యూనియన్ కనుమరుగైన తర్వాత మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ క్రమంగా వేళ్లూనుకునే వరకు కొన్నేళ్ల పాటు భారతీయులు సందిగ్ధంలో చిక్కుకున్నారు.
పిల్లలతోపాటు పేరెంట్స్దీ అదే దారి
తర్వాతీ కాలంలో సామాజికంగా, మానసికంగా తమను తాము భారతీయులు తమ ఓరియెంటేషన్ మార్చుకున్నారు. 1990 చివర్లో మార్కెట్ ఆధారిత ఉద్యోగాలు సాదించుకోవడంపై భారత మధ్య తరగతి వర్గం ద్రుష్టి సారించింది. ప్రత్యేకించి ప్రైవేట్ రంగ ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం పట్టారు. ఎడతెగని డిజిటల్ టెక్నాలజీతో ముందుకు వస్తున్న ఉపాధి అవకాశాలపై పదేపదే యువత తమ ఆకాంక్షలు పెంచుకుంటూ వచ్చింది. బాలలే కాదు వారి తల్లిదండ్రుల తరం కూడా ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షిస్తూ వచ్చింది.
యూపీఎస్సీ స్థానే టోఫెల్, శాట్లకు ప్రాధాన్యం
ఈ మార్పుల నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్, అమెరికనిజం శరవేగంగా యువత మెదళ్లలోకి దూసుకొచ్చింది. అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవడంతోపాటు అక్కడే భవిష్యత్లో స్థిరపడి పోవాలన్న ఆకాంక్షలు పదేపదే పెరిగిపోయాయి. సోవియట్ యూనియన్ అంతర్దానానికి ముందు ఐఎఎస్ లుగా నియామకమయ్యే యూపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఎంత ఆసక్తి చూపేవారు.. అదే స్థాయిలో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ‘శాట్', ‘టోఫెల్' తదితర పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూ వచ్చింది. అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందడమే పరమావధిగా మారుతూ వచ్చింది.
65 వేల నుంచి లక్షకు చేరిన ఉద్యోగార్థులు
2000వ దశకం ప్రారంభంలో చాలా మంది రుణాలతో అమెరికా యూనివర్సిటీలో ఉన్నతవిద్యాకోర్సులో చేరడం, తదుపరి ఉద్యోగం పొందడం.. ఆ పై గ్రీన్ కార్డు అందుకుని శాశ్వత పౌరసత్వం పొందాలని ఆరాటపడే వారు క్రమంగా పెరుగుతూ వచ్చారు. 1995లో 65 వేల మంది భారతీయులు అమెరికాలో అడుగు పెడితే 2014లో హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికాలో అడుగు పెట్టిన వారి సంఖ్య లక్ష దాటింది. అమెరికాలో విలాసవంతమైన జీవితం గడుపాలన్న ఆకాంక్ష భారతీయుల్లో మానసికంగానూ, ఆలోచనా పరంగానూ పెరిగింది. ఉత్తమ భవిష్యత్ కోసం ఈ ఆకాంక్షలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
ఈయూ నుంచి వైదొలిగేందుకు బ్రిటన్ ఇలా
కానీ గత వారం, పది రోజులుగా గ్లోబలైజేషన్ ప్రక్రియ పూర్తిగా న్యాయపరమైన సవాళ్లలో చిక్కుకున్నది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ ‘బ్రెగ్జిట్' నిర్ణయం, అమెరికన్లకే ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ట్రంప్ వాదం.. భారతీయ ఐటీ నిపుణుల్లో ఆందోళన రేకెత్తించాయి. హెచ్ - 1 బీ వీసాలను నియంత్రించాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంతో పరిస్థితి పతాకస్థాయికి చేరుకున్నది. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని మార్కంబుల్ ‘457 వీసా' విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. న్యూజిలాండ్ ‘కివీ ఫస్ట్' కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. ఆస్ట్రేలియాలోనూ ‘457 వీసా' కింద ఉద్యోగాలు చేస్తున్న విదేశీ నిపుణుల్లో భారతీయులు మూడోవంతు ఉంటారు. ఇక అమెరికాలో హెచ్ 1 బీ వీసా కింద పని చేస్తున్న విదేశీ నిపుణుల్లో భారత ఐటీ నిపుణులు 85 శాతం ఉంటారని గణాంకాలు చెప్తున్నాయి.
బ్రిటన్లోని విదేశీ నిపుణుల్లో 60 శాతం ఇండియన్లే
అంతకుముందు బ్రిటన్ సైతం బయటివారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తే వేతనాలు ఎక్కువ చెల్లించాలని పేర్కొంటూ విదేశీ నిపుణుల రాకకు వీలు కలిగే వీసా నిబంధనలను కఠినతరం చేసేసింది. బ్రిటన్లో పనిచేస్తున్న విదేశీ నిపుణఉల్లో 60 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయులు ఉపాధి కోసం అక్కడ నివాసం ఉండకుండా నిబంధనలు కఠినతరం చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఇక భారతీయులకు ప్రజాదరణ పొందిన మరో ఉపాధి కేంద్రం సింగ పూర్ కూడా విదేశీ ఉద్యోగ నియామకాలు అవసరమైతే రెండు వారాల ముందు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
సౌదీలో 50 శాతం అవకాశాలు హుష్ కాకి
అరబ్ దేశాల్లోనూ ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పట్టడంతో భారతీయులకు ఇబ్బందికరంగా మారింది. సాధారణ కార్మికులు, సెమీ స్కిల్డ్ భారతీయులకు ఉపాధికి అనువైన కేంద్రంగా గల్ఫ్ దేశాలు ఉండేవి. 2016లో గల్ఫ్ దేశాల్లో భారతీయులకు ఉద్యోగాలు 33 శాతం తగ్గుముఖం పట్టాయి. క్రమంగా భారతీయుల పెట్రో డాలర్ కలలు క్రమంగా కరిగిపోతున్నాయి. గత ఏడాది సౌదీ అరేబియాలో భారతీయులకు 50 శాతం ఉద్యోగాలు తగ్గాయి.