భారీ భూకంపం.. సునామీ రావచ్చంటూ హెచ్చరిక, భయంతో పరుగులుదీసిన జనం
ఫిలిప్పీన్స్లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంపం నేపథ్యంలో సునామీ కూడా వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
మనీలా: ఫిలిప్పీన్స్లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. దీని ప్రభావం వల్ల పలు భవంతులు దెబ్బతినగా, ఇద్దరు గాయపడ్డారు.
భూకంప తీవ్రత ధాటికి ప్రభుత్వ భవనాలు బీటలుబారాయి. భూకంపం నేపథ్యంలో సునామీ కూడా వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మిండనావో ద్వీపంలో 41 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
శనివారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయంతో నిద్రలేచి, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు హడావుడిగా బయటకు వెళ్లే ప్రయత్నంలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఈ నెల 12న కూడా మిండనావోలోనే సంభవించిన భూకంపంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఫిబ్రవరిలో మిండనావోలోని సురిగావోలో వచ్చిన భూకంపం వల్ల ఎనిమిది మంది మరణించగా, మరో 250 మందికిపైగా గాయపడ్డారు.