బుల్లెట్ ట్రైన్ లో ఆత్మహత్య: ఇద్దరి మృతి
టోక్యో: జపాన్ లో బుల్లెట్ ట్రైన్ లో దారుణం చోటు చేసుకుంది. వాయు వేగంతో వెళుతున్న సమయంలో రైలులో ఒకరు తన శరీరానికి నిప్పంటించుకోవడంతో మంటలు వ్యాపించాయి. ఈ సంఘటనతో ఇద్దరు మరణించగా అనేక మందికి గాయాలైనాయి.
మంగళవారం ఉదయం జపాన్ రాజధాని టోక్యో నుండి ఒకాసా నగరానికి బుల్లెట్ ట్రైన్ బయలుదేరింది. మార్గం మధ్యలో ఓడావర నగరం సమీపంలో అదే రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి తన వెంట తీసుకుని వెళ్లిన కెమికల్స్ (నూనె లాంటి ద్రవ పదార్థం) మీద పోసుకున్నాడు.
రైలులో ఉన్న సాటి ప్రయాణికులు అందరూ చూస్తున్నసమయంలో క్షణాలలో జేబులో ఉన్న సిగరెట్ లైటర్ తీసుకుని నిప్పంటించుకున్నాడు. కెమికల్ కిందపడటం, మంటలకు తట్టుకోలేక అతను పరుగు తీయ్యడంతో సాటి ప్రయాణికులకు మంటలు వ్యాపించాయి.
వారిలో ముగ్గురికి తీవ్రగాయాలైనాయి. అదే రైలులో ఉన్న ఒక మహిళకు మంటలు వ్యాపించి అక్కడే మరణించారు. రైలులో దట్టమైన పోగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైనారు. పలువురు స్పృహ కోల్పోయారు. ప్రయాణికులు మొబైల్ ల నుండి ఫోన్ చేసి రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
రైలును ఓడావర నగరంలో నిలిపి వేసి బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి, మరణించిన మహిళ వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అధికారులు తెలిపారు.