‘సమయం లేదు మిత్రమా.. చర్చలా, క్షిపణులా..’? చైనాకు షాకిచ్చిన అమెరికా!
ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిని, మితిమీరుతున్న అణ్వస్త్ర ప్రయోగాలను చర్చల ద్వారా అడ్డుకునేందుకు చైనాకు అతి కొద్ది సమయం మాత్రమే మిగిలివుందని అమెరికా హెచ్చరించింది.
ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిని, మితిమీరుతున్న అణ్వస్త్ర ప్రయోగాలను చర్చల ద్వారా అడ్డుకునేందుకు చైనాకు అతి కొద్ది సమయం మాత్రమే మిగిలివుందని అమెరికా హెచ్చరించింది.
బీజింగ్ లో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఈస్ట్ ఏషియన్ అండ్ పసిఫిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ సుసాన్ థొరాంటన్.. ఉత్తర కొరియా సమస్యను చాలా త్వరతిగతిని పరిష్కరించాల్సి ఉందని అన్నారు.
ఆయన దూకుడుకు కళ్లమేస్తారా? లేదా?
ఉత్తరకొరియా దూకుడుకు వీలైనంత త్వరగా కళ్లెమేస్తే బాగుంటుందని అమెరికా సూచించింది. ఇందుకు సమయం కూడా తక్కువగానే ఉందని, ఈ లోగానే కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తో మాట్లాడాలని చైనాను కోరింది. ‘ఈ విషయంలో తమకు సమయం తక్కువగానే ఉందన్న సంగతి చైనాకు తెలుసుననే అనుకుంటాను. నార్త్ కొరియన్లను చర్చలకు పిలిచి మాట్లాడాల్సిన సమయం ఇదే.. ఇది కూడా చాలా త్వరగా జరగాలి..' అని అమెరికాకు చెందిన ఈస్ట్ ఏషియన్ అండ్ పసిఫిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ సుసాన్ థొరాంటన్ అన్నారు.
ఈ ఉత్సాహం ఇలాగే కొనసాగితే నష్టమే...
ఇటీవలి కాలంలో డజనుకు పైగా క్షిపణి పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంకా ఇదే తరహాలో మరిన్ని అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సైన్యం ఉత్సాహంతో ఉంది. ఉత్తర కొరియా ఉత్సాహంపై ఇప్పటికైనా నీళ్ల చల్లకపోతే అది భవిష్యత్తులో మరింత ప్రమాదానికి దారితీస్తుందని అమెరికా ఆందోళన చెందుతోంది.
బుద్ధి చెప్పేందుకు అమెరికా యత్నాలు...
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను అడ్డుకునే చర్యల్లో భాగంగా అమెరికా తన వంతు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఉత్తరకొరియాకు బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో అమెరికా ఇప్పటికే తన థాడ్ మిస్సైల్ వ్యవస్థను దక్షిణ కొరియాకు పంపించింది. అయినా ఉత్తరకొరియా ఏమాత్రం లెక్కచేయకపోవడంతో తన యుద్ధనౌక, కార్ల్ విన్సన్ ను, దానికి తోడుగా మిచిగన్ జలాంతర్గామిని కూడా దక్షిణ కొరియా సముద్రజలాల్లో మోహరింపజేసింది. అయినప్పటికీ ఉత్తరకొరియా అధినేత కిమ్ తన అణ్వస్త్ర ప్రయోగాలను కొనసాగించడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చిర్రెత్తిస్తోంది.
చైనా మెతక వైఖరి.. అసహనంలో ట్రంప్
మరోవైపు ఉత్తరకొరియా మిత్రదేశమైనా చైనాపై కూడా ఒత్తడి పెంచింది. నయానో భయానో నచ్చజెప్పి చూడమంటూ చైనా అధ్యక్షుడిని కూడా ట్రంప్ ఇప్పటికే కోరారు. అయినా ఉత్తరకొరియా వైఖరిలో కించిత్ మార్పు కూడా కానరాలేదు. పైపెచ్చు ఇటీవల ట్రంప్ సౌదీ అరేబియా పర్యటకు వెళ్లిన సమయంలో కూడా ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష్ నిర్వహించడం అమెరికాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఏదో పెద్ద మనిషి తరహాలో కాస్త మాట్లాడి చూస్తుందేమో అని భావిస్తే.. చైనా కూడా ‘ఇదిగో మాట్లాడుతున్నా..'నంటూ కాలం వెళ్లబుచ్చుతుండడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహించలేకపోతున్నారు.
చైనాకూ షాకిస్తే తప్ప...
ఈ నేపథ్యంలో చైనాకు కూడా షాకిస్తే తప్ప అది తన అంచనాలకు అనుగుణంగా వ్యవహరించదనే నిర్ణయానికొచ్చింది అమెరికా. దీంతో అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అమెరికా చైనాకు గట్టి సవాల్ విసిరింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమంగా నిర్మించిన దీవుల్లోకి తాజాగా అమెరికా క్షిపణి విధ్వంసక నౌక యూఎస్ఎస్ డీవే చొచ్చుకెళ్లింది. అమెరికా చర్యతో చైనా కంగుతింది. దక్షిణ చైనా కృత్రిమ దీవుల్లో 12 నాటికల్ మైళ్ల దూరంకి అమెరికా యుద్ధనౌక ప్రయాణించిందని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిన తర్వాత చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న తొలి నిర్ణయం ఇదేనని చెప్పొచ్చు.
మిస్చీఫ్ రీఫ్కు అత్యంత సమీపంలో...
దక్షిణ చైనా సమ్రుద జలాలపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చైనా శతవిధాలా ప్రయత్నిస్తోంది. పొరుగున ఉన్న తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం దేశాలు వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా దక్షిణ ప్రాంత సముద్ర జలాల్లో చైనా కృత్రిమ దీవులను, ఓడరేవులను నిర్మిస్తూ వస్తోంది. అందులో ఒకటైన స్ప్రాట్లీ దీవుల్లోని మిస్చీఫ్ రీఫ్కు అత్యంత సమీపంలోనే అమెరికా పంపించిన యుద్ధనౌక యూఎస్ఎస్ డీవే సంచరించడం చైనాకు షాకిచ్చింది. ఇది తమ సార్వభౌమత్వాన్ని, భద్రతా వ్యవస్థను సవాల్ చేయడంగానే భావించాల్సి ఉంటుందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి లూ కాంగ్ చెప్పారు. ఇప్పటికైనా ఉత్తరకొరియా విషయంలో చైనా సరైన చర్యలు తీసుకోకపోతే అది భవిష్యత్తులో ఆ దేశానికి కూడా ప్రమాదకరమే అనే హెచ్చరిక చేయడం కోసమే అమెరికా ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.