రంగంలోకి యూఎస్ ‘డ్రాగన్ లేడీ’: కిమ్ ఏం చేసినా ట్రంప్కి తెలిసిపోతుంది!
సియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. దీంతో అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. అమెరికాపై ఇప్పుడే దాడి చేయడం లేదని ఉత్తర కొరియా ప్రకటించినప్పటికీ.. ఆ మాటల్ని అమెరికా పూర్తిగా విశ్వసించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా తన జాగ్రత్తలో తానుంటోంది.
ఉ. కొరియాపై ఓ కన్నేసిన అమెరికా
శత్రు దేశం ఉ. కొరియా కదలికలపై అమెరికా ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలో అమెరికా సైన్యం తన అత్యాధునిక యుద్ధ విమానం 'డ్రాగన్ లేడీ'ని రంగంలోకి దించింది. ఉత్తరకొరియా రాడార్లు కనిపెట్టలేనంత ఎత్తులో అంటే సుమారు 70 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అది పహారా కాస్తుంది.
జపాన్కు..
సోమవారం సాయంత్రం ఆ విమానం జపాన్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరనుందని అమెరికా సైన్యం తెలిపింది. చాలా ఎత్తులో ఈ విమానాన్ని నడపవలసి ఉండడంతో ఇందులోని పైలెట్లు వ్యోమగాములు ధరించేటటువంటి దుస్తులను ధరిస్తారని అమెరికా సైన్యాధికారులు తెలిపారు.
దాడికి దిగే అవకాశం..
అంతర్జాతీయ ఒత్తిడితోనే ఉత్తర కొరియా దాడిని వాయిదా వేసిందని, దాడిని రద్దు చేసుకోలేదని అమెరికా సైన్యం భావిస్తోంది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించే సమయంలో ఉత్తరకొరియా తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని అనుమానిస్తోంది.
అందుకే డ్రాగన్ లేడీ..
ఈ క్రమంలో ఉత్తర కొరియా తీవ్ర నిర్ణయం తీసుకుంటే ముందుగానే గుర్తు పట్టాల్సిన బాధ్యత తమపై ఉందని అమెరికా సైన్యం చెబుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఉత్తరకొరియాపై నిఘా కోసం అత్యంత శక్తిమంతమైన కెమెరాలతో పహారా కాసేందుకు డ్రాగన్ లేడీని రంగంలోకి దించామని తెలిపింది. ఉ. కొరియా చర్యలను బట్టి తమ ప్రతిచర్యలుంటాయని పేర్కొంది.
ఉత్తర కొరియా ఆగ్రహం
దక్షిణ కొరియాతో కలిసి అమెరికా దళాలు విన్యాసాలు నిర్వహిస్తున్న క్రమంలో ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు ఇలాగే వ్యవహరిస్తే ఎలాంటి దయ, దాక్షిణ్యాలు లేకుండా దాడులకు పాల్పడతాం' అంటూ ఘాటుగా హెచ్చరించింది.