యూనియన్ కార్బైడ్ అండర్సన్ మృతి: గుట్టుగా..
న్యూయార్క్: భారతదేశంలోని భోపాల్లో 30 ఏళ్ల క్రితం విషవాయువు లీక్ దుర్ఘటనతో వేలాదిమందిని బలిగొన్న కంపెనీ యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ అండర్సన్ మరణించాడు. 92 ఏళ్ల ఆండర్సన్ సెప్టెంబర్ 29న ఫ్లారిడాలోని వెరో బీచ్లోని ఒక నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతని మరణాన్ని కుటుంబసభ్యులు బహిర్గతం చేయలేదు.
అయితే, బహిరంగ రికార్డుల వల్ల వెలుగులోకి వచ్చినట్లు ‘న్యూయార్క్ టైమ్స్' పత్రిక వెల్లడించింది. 1984 డిసెంబర్ 2వ తేదీ అర్థరాత్రి తర్వాత భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్లో విడుదలైన మిథైల్ ఐసో సైనైడ్ వాయువు మూలంగా 3,787 మందికిపైగా మరణించారు.
ప్రపంచ పారిశ్రామిక దుర్ఘటనల్లోనే అత్యంత ఘోరమైన ‘భోపాల్ దుర్ఘటన'లో అనధికార అంచనాల ప్రకారం 10 వేల మంది ప్రాణాలు కోల్పోగా...విషవాయువును పీల్చి ఐదు లక్షల మందికిపైగా భయంకరమైన వ్యాధుల బారినపడ్డారు. దుర్ఘటన తర్వాత ఒక దోషిగా భయపడుతూ భోపాల్ వచ్చిన అండర్సన్ అదే రోజు ఒక మహారాజుగా అమెరికా వెళ్లిపోయాడు.
వేలాదిమంది భారతీయుల జీవితాలను బలితీసుకున్న అండర్సన్ను బోనులో నిలిపేందుకు భారత ప్రభుత్వం చేసిన ఫలించకపోగా అమెరికా ఒత్తిళ్లకు అప్పటి రాజీవ్ ప్రభుత్వం లొంగిపోయింది. 1984 డిసెంబర్ ఏడున అండర్సన్ భోపాల్ రాగానే విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి భోపాల్ పోలీసు కమిషనర్ స్వరాజ్ పురి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఈలోగా అండర్సన్ తరఫున అమెరికా రంగంలోకి దిగి ఆయన విడుదలకు రాజీవ్పై ఒత్తిడి తెచ్చింది. కొన్ని గంటల వ్యవధిలో అండర్సన్ బెయిల్పై విడుదలయ్యాడు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులే అధికార మర్యాదలతో ప్రభుత్వ వాహనంలో భోపాల్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించారు. అండర్సన్కు భార్య లిల్లియాన్ ఉంది.