ఆస్ట్రేలియాలో దారుణం: 8మంది చిన్నారుల మృతి, ప్రధాని దిగ్భ్రాంతి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో సిడ్నీ కేఫ్ ఘటన మరవకముందే మరో దారుణం చోటు చేసుకుంది. సౌత్ క్వీన్స్లాండ్లోని కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం 8మంది చిన్నారుల మృతదేహాలు పడివున్న వార్త యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసింది.
కెయిర్న్స్ పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో ఒక మహిళ గాయపడి ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మహిళను ఆస్పత్రికి తరలించి ఇంటిని శోధించగా 8 మంది పిల్లల మృతదేహాల లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసిన పోలీసులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. పిల్లల వయసు 18 నెలల నుంచి 15ఏళ్ల వరకూ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
గాయపడిన 35ఏళ్ల మహిళకు చికిత్స అందిస్తున్నామని, ఆమె తమ విచారణకు సహకరిస్తోందని పోలీసులు చెప్పారు. పిల్లలపై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు గాయాలను బట్టి తెలుస్తోందని చెప్పారు. కాగా, దాడికి సంబంధించి ఇంతకుమించి వివరాలేమి పోలీసులు ఇప్పటి వరకు వెల్లడించలేదు.
ఆ పిల్లలందరూ తోడబుట్టినవారేనని, వారి సోదరుడే పోలీసులకు సమాచారం అందించివుంటాడని స్థానికులు భావిస్తున్నారు. కాగా, 8మంది చిన్నారుల మృతి పట్ల ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఈ మానుష ఘటన మాటల్లో చెప్పలేని విధంగా ఉందని అన్నారు. ఈ దుర్ఘటన పిల్లల తల్లిదండ్రులకే కాదు అందరికీ మింగుడుపడని వాస్తవమని, గుండెల్ని పిండేసి దారుణమని అన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని చెప్పారు. దేశ ప్రజలు శుక్రవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించాలని కోరారు.