నకిలీ పిస్టల్ ఎత్తిన బాలుడ్ని చంపేశారు, తండ్రి ఏడ్పు
ఓహ్యా: పన్నెండేళ్ల ఆఫ్రికన్ అమెరికన్ బాలుడు అన్యాయంగా కాల్పులకు గురై మరణించాడు. నకిలీ పిస్టల్ను చేతిలో పట్టుకుని ఊపినందుకు అతన్ని క్లీవ్ల్యాండ్ పోలీసులు కాల్చి చంపారు. కాల్చి చంపడానికి ముందు బాలుడిని ఇతర భయపెట్టే ఆయుధాలతో ఎందుకు లొంగదీసుకునే ప్రయత్నం చేయలేదని అతని తండ్రి పోలీసులను ప్రశ్నించాడు.
ప్రమాదాన్ని నివారించడానికి అనుమానిత నిందితుడిని స్తంభింపజేయడానికి ఎలక్ట్రిక్ ఆయుధం లేదా ఎలక్ట్రిక్ షాక్ ఆయుధం వంటి టేజర్ను ఎందుకు వాడలేదని ఆయన ప్రశ్నించాడు. కడెల్ రిక్రియేషన్ సెంటర్ వెలుపల గల పార్కులో ప్రజలపైకి 12 ఏళ్ల బాలుడు బొమ్మ తుపాకిని ఎక్కుపెట్టాడు.
ఆ బాలుడిపైకి ఇద్దరు పోలీసులు కాల్పులు జరిపినట్లు వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి. చేతులెత్తాలని తాము బాలుడిని ఆదేశించామి, అయితే అతను వినలేదని, దాంతో నిజమైన తుపాకి అనుకుని కాల్పులు జరిపామని పోలీసులు అంటున్నారు.
బాలుడి మృతిపై దర్యాప్తునకు ఆదేశించారు. బాలుడిపై కాల్పులు జరిపిన ఇద్దరిని పాలనాపరమైన సెలవుపై పంపించేశారు. బాలుడిని తమీర్ రైస్గా క్లీవ్ల్యాండ్ పోలీసులు గుర్తించారు. తన కుమారుడిపై కాల్పులు జరిపిన పోలీసుల చర్యను తండ్రి గ్రెగొరి హెండర్సన్ ఖండించారు. తన కుమారుడికి 12 ఏళ్ల వయస్సు మాత్రమే ఉందని, అతనేం చేస్తున్నాడో అతనికి తెలియదని, వారేం చేస్తున్నారో పోలీసులకు తెలుసునని అన్నట్లు డెయిలీ మెయిల్ రాసింది.
హెండర్సన్ మీడియాతో మాట్లాడుతూ ఏడ్చేశాడు. ఉద్వేగాన్ని ఆపుకోలేక బోరున విలపించాడు. ఏడ్పును ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అయితే పరిస్థితి తనను అలా ఉండనీయడం లేదని అతను అన్నాడు. తన కుమారుడు తనకు సూపర్ హీరో అని, బాస్కెట్ బాల్ అత్యంత ఇష్టంగా ఆడేవాడని, తన వయస్సుకన్నా పెద్దవాడిగా కనిపించేవాడని, చాలా మర్యాదగా ఉండేవాడని, అత్యంత కళాత్మకంగా ప్రవర్తించేవాడని అన్నారు.
సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లి కాల్పులు జరపాల్సి వచ్చిన 911 కాల్ను క్లీవ్ల్యాండ్ పోలీసులు విడుదల చేశారు.